బల్దియా పోరుకు కసరత్తు!

17 May, 2019 12:08 IST|Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు త్వరలో ముగియనుండడంతో మరో నెలరోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సమాయత్తమవుతున్నారు. గతంలో మే 31లోగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ అడ్మిస్ట్రేషన్‌ డైరెక్టర్, కమిషనర్‌ నుంచి మున్సిపాలిటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

కానీ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకొని పట్టిష్టమైన మున్సిపల్‌ చట్టాలను అమల్లోకి తెద్దామని ఇదీ వరకు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. చట్టం అమలులోకి వచ్చిన 15 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మున్సి పాలిటీ పాలక వర్గం గడువు జూన్‌ 3తో ముగియనుంది. తాజాగా సీఎం కేసీఆర్‌ మున్సిపాలిటీ ఎన్నికలను జూన్‌ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో నిర్వహించనున్నట్లు ప్రటిం చారు.

ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదీ వరకే ఓటరు ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించడంతో అధి కారులు వాటిని సిద్ధం చేశారు. మున్సి పాలిటీలో వార్డుల వారీగా ఓటరు జాబి తాలను రూపొందించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణను  సిద్ధం చేశారు. వీటి బాధ్యతలను కమిషనర్లకు అప్పగించారు. ఇది వరకే ముసాయిదా జాబితా విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. తుది జాబితా విడుదల చేశారు. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఎన్నికల ముసాయిదా విడుదలైనా ఇంకా మున్సిపాలిటీలో వార్డుల పెంపుపై స్పష్టత రావాల్సి ఉంది.

వార్డుల పెంపుపై స్పష్టత రాని వైనం
మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్‌లో ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. అదే నెలలో కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఎన్నికల ముసాయిదా విడుదలైనా మున్సిపాలిటీలో వార్డులను పెంచడంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత రాలేదు. గతంలో మున్సిపాలిటీలో విలీనమైన జీపీలను అధికారులు సమీప వార్డుల్లో సర్దుబాటు చేశారు. ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రస్తుతం ఉన్న 36 వార్డులకు తోడు మరోఐదు వార్డులు పెంచాలంటూ మున్సిపల్‌ కౌన్సిల్, ఎమ్మెల్యే జోగు రామన్న రాష్ట్ర మున్సిపల్‌ శాఖకు విన్నివించిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మున్సిపాలిటీలో కొత్తగా వార్డులు పెరుగుతాయా..లేక ప్రస్తుతం ఉన్న 36 వార్డుల్లోనే సర్దుబాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.

పోలింగ్‌కేంద్రాల ఏర్పాటుకు విధివిధానాలు 
మున్సిపాలిటీ ఎన్నికల్లో 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. కుటుంబంలోని ఓటర్లు అందరు ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం అధికారులు ఓటరు జాబితా లను రూపొందించే అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడు వార్డులకు ఒక రిటర్నింగ్‌ అధికారితోపాటు సహాయ అధికారిని నియమించే అవకాశం ఉంది.

విలీన గ్రామాలపై తేలని నిర్ణయం
ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. గతేడాది పట్టణానికి సమీపంలోని గ్రామాలను విలీనం చేశారు. మావల పంచాయతీ, బట్టిసావర్‌గాం, రాంపూర్, అనుకుంట, బెల్లూరి, నిషాన్‌ఘాట్‌లను విలీనం చేశారు. సీడీఎంఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపాలిటీ అధికారులు విలీన జీపీలు, కాలనీలను సమీప మున్సిపాలిటీ వార్డుల్లో విలీనం చేశారు. దీంతో 32వ వార్డులో రాంపూర్‌ గ్రామాన్ని కలిపారు. 13వ వార్డులో అనుకుంట, 27వ వార్డులో బట్టిసావర్‌గాం జీపీలోని టైలర్స్‌కాలనీ, వివేకానంద, ఎన్‌హెచ్‌బీకాలనీ, అగ్రజా టౌన్‌షిప్, ఆదర్శకాలనీ, భగత్‌సింగ్‌కాలనీలను విలీనం చేశారు.

3వ వార్డులో బేల్లూరి, నిషాన్‌ఘాట్, 19వ వార్డులో మావల మేజర్‌ గ్రామ పంచాయతీలోని దస్నాపూర్, దర్గానగర్, కేఆర్‌కే కాలనీ, పీహెచ్‌కాలనీ, ఇందిరమ్మ కాలనీ, కృష్ణానగర్, అటెండర్‌ కాలనీలను విలీనం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం 36 వార్డులు ఉండగా మరో ఐదు వార్డులను పెంచి మొత్తం 41 వార్డులు చేస్తారని మున్సిపల్‌ పాలకవర్గం భావిస్తూ వస్తోంది. తాజాగా ఎన్నికల సంఘం ఎన్నికల ముసాయిదా విడుదల చేసింది. కొత్తగా వార్డులను పెంచుతారా? లేక సర్దుబాటు చేసిన వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పోటీ చేసి అదృష్టం పరీక్షించుకుందామనుకునే వారి సంఖ్య అన్ని పార్టీల్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వార్డులు పెరిగితే కౌన్సిలర్‌గా పోటీ చేద్దామనుకునే ఆశావహుల్లో ఒకింత ఆందోళన కనిపిస్తోంది.

>
మరిన్ని వార్తలు