విద్యార్థి గళం..తెలంగాణ విద్యార్థి వేదిక

29 Jan, 2015 04:02 IST|Sakshi

నల్లగొండ అర్బన్ : ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచిన నల్లగొండ జిల్లా తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర 4వ మహాసభలకు వేదికయ్యింది. ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమనే లక్ష్యంతో 2006 అక్టోబర్ 26న ఆవిర్భవించింది. లక్ష్యసాధనలో మొదటి మెట్టును చేరుకున్న క్రమంలో ప్రజాస్వామిక తెలంగాణే ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందనే విశ్వా సంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో క్రియాశీలక ఉద్యమాలు నిర్వహిస్తున్న టీవీవీ నేడు, రేపు జరిగే మహాసభల ద్వారా భవిష్యత్ కార్యచరణపై గళం విప్పనుంది.
 
 ఉద్యమ వారధిగా..
 మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ క్రియాశీలక పాత్రను పోషించిన ఘనత టీవీ వీది. విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేసి ఆ సంఘానికి నాయకత్వం వహించడమే కాకుండా ఉద్యమానికి వారధిగా నిలిచింది. గడచిన ఆరేళ్లలో తెలంగాణ విద్యార్థి వేదిక సాగించిన పోరాటాల పరంపరపై సింహవలోకనం. 2009వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) కేంద్రంగా ప్రారంభమైన ఉద్యమంలో అత్యంత కీలకపాత్రను పోషించింది.  2010 ఫిబ్రవరిలో ఏర్పడిన విద్యార్థి జేఏసీకి చైర్మన్‌గా వ్యవహరించే నాయకత్వాన్ని స్వీకరించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది టీవీవీ.

 చలో అసెంబ్లీ, రాజ్‌భవన్, మిలియన్ మార్చ్‌లాంటి పోరాటాల్లో క్రియాశీలక పాత్ర. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా 16 మంది విద్యార్థినులు అసెంబ్లీలోకి ప్రవేశించి జైలుకెళ్లి తెలంగాణ నినాదాన్ని ఢిల్లీకి వినిపించారు. వరంగల్ జిల్లా రాయినిగూడెంలో రచ్చబండకు హాజ రైన సమైక్యాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని అడ్డుకొని ప్రజలందరిచేత జై తెలంగాణ నినాదాలిప్పించడంతో కిరణ్ సభను రద్దు చేసుకొని వెళ్లిపోయారు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని, ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలపవద్దని పాదయాత్ర నిర్వహించి భద్రాచలంలో ప్రజాసంఘాలు, ప్రజలతో సమావేశం నిర్వహించింది.

 ఆదిలాబాద్‌లోని కత్వాల్ టైగర్‌జోన్‌కు వ్యతిరేకంగా ఆప్రాంతంలో పాదయాత్ర నిర్వహణ ద్వారా ప్రజా చైతన్యానికి కృషి చేసింది.
 ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కుతరలింపునకు వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహించి బయ్యారంలో సభ ద్వారా తెలంగాణ రాజకీయ పార్టీలను అటువైపు మళ్లించడంలో కీలకపాత్ర వహించింది. సకలజనుల సమ్మెలో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంద్‌లో క్రియాశీలక పాత్ర పోషించింది. నకిరేకల్‌లో జరిగిన పోరాటంలో అగ్రభాగాననిలిచి జిల్లా నాయకత్వం జైలుకు వెళ్లింది.

 మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని పాదయాత్ర నిర్వహణ. సాంస్కృతిక అణచివేతకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్‌ఫెస్టివల్ (పెద్దకూరపండుగ) నిర్వహించి దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసింది.  కామన్‌స్కూల్ విద్యా విధానం అమలు చేయాలని అఖిల భారత విద్యాహక్కు వేదిక ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో క్రియాశీలకంగా పాల్గొన్నది.
 ప్రజాస్వామిక తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ విద్యార్థి వేదిక ముందుకు సాగుతున్నది.
 

మరిన్ని వార్తలు