అన్నదమ్ముల మృతితో జిల్లాలో విషాదం

1 Mar, 2017 09:38 IST|Sakshi
అన్నదమ్ముల మృతితో జిల్లాలో విషాదం
తల్లిదండ్రి ఆకాంక్షకు అనుగుణంగానే సోదరులిద్దరూ ఉన్నత విద్యను అభ్యసించారు. మంచి ఉద్యోగాలు చేస్తూ గౌరవంగా జీవనం సాగిస్తున్నారు.. వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడాలనే సోదరులపై విధి కన్నెర్రజేసింది.. స్వగ్రామానికి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. 
 
► రోడ్డు ప్రమాదంలో సోదరుల దుర్మరణం
► కృష్ణాజిల్లాలో దుర్ఘటన
► కోదండాపురంలో విషాదఛాయలు
 
కోదండరాంపురం (గరిడేపల్లి) : 
గరిడేపల్లి మండలం కోదండరాంపురం గ్రామానికి చెందిన నలబోలు శేషిరెడ్డి,–కమలమ్మ దంపతులకు కుమార్తె నాగలక్ష్మి, ఇద్దరు కుమారులు నలబోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి సంతానం. రెండేళ్ల క్రితమే కుమార్తెకు వివాహం చేశారు. పెద్దవాడైన నలబోలు కృష్ణారెడ్డి (31),  బెంగుళూరులోని క్యాప్‌జెమినీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా, శేఖర్‌రెడ్డి(29) ఒడిశాలో భువనేశ్వర్‌ ఆర్మీక్యాంప్‌లో ప్రభుత్వ వైద్యుడిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 
 
వివాహం చేసుకోవాలని..
ఇద్దరు కుమారులు ప్రయోజకులు కావడంతో శేషిరెడ్డి వారికి వివాహ సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లి సంబంధాలు చూసుకునేందుకు కృష్ణారెడ్డి సెలవుపెట్టి తమ్ముడి వద్దకు వెళ్లాడు. అనంతరం ఇద్దరూ కలిసి మంగళవారం భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ఎక్కి పయనమయ్యారు. 
 
మార్గమధ్యలో..
ఆనందంగా స్వగ్రామానికి బయలుదేరిన సోదరులిద్దరికీ మార్గమధ్యలో అనుకోని ప్రమాదం ఎదురైంది. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న బస్సు కల్వర్టును ఢీకొట్టి బోల్తాకొట్టింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 11 మందిలో ఈ సోదరులూ ఉన్నారు. 
 
మిన్నంటిన రోదనలు
వివాహం చేసి కుమారుల అచ్చటాముచ్చటా చూడాలనుకున్న తల్లిదండ్రికి తలకొరివి పెట్టాల్సి రావడంతో వారి రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకుని బంధువులు శేషిరెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శిం చారు. ప్రయోజకులైన కుమారు లు సంతోషంగా ఉంటే చూడాలనుకు న్న తమకు కడుపుకోత మిగిల్చా వా దేవుడా అంటూ వృద్ధ దంపతులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. మృతదేహాలను రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు.