బడా పహాడ్‌లో సమస్యలు

1 May, 2015 05:36 IST|Sakshi

బాన్సువాడ : తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల పవిత్ర దర్గాల్లో ప్రముఖమైన దర్గా బడా పహాడ్ దర్గా. ఈ దర్గా ద్వారా వక్ఫ్‌బోర్డుకు ఏటా రూ. 2 నుంచి 3 కోట్ల ఆదాయం వస్తోంది. సుమారు లక్ష నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వీరితో పాటు మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. ఈ దర్గాకు వచ్చే భక్తులు, మనస్ఫూర్తితో న్యాయమైన కోరికలు కోరితే అవి నెరవేరుతాయనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన దర్గాలో సమస్యలు తిష్టవేశాయి. రాబడి గురించి పట్టించుకుంటున్న దర్గా అభివృద్ధి కమిటీ సభ్యులు సమస్యల పరిష్కారంలో చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముజావర్లు (దర్గా పర్యవేక్షకులు) దోపిడీయే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  
 
భక్తులను దోచుకుంటున్న కాంట్రాక్టర్లు
బడాపహాడ్ నిర్వహణకు ఏటా వేలం నిర్వహిం చిన కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. ఏడాదికి సగటు న రూ.2 నుంచి 3 కోట్ల వరకు వేలం పాడి కాంట్రాక్ట్ దక్కించుకుంటారు. తర్వాత వక్ఫ్‌బోర్డు అధికారులు, కాంట్రాక్టర్లు దీనిని పట్టించుకోకపోవడంతో సమస్యలు ఎక్కడివక్కడే తిష్ట వేస్తున్నాయి. అంతేకాకుండా కోట్లు పెట్టి పాట పాడిన కాంట్రాక్టర్లు వాటిని సంపాదించుకునేందుకు బలవంతంగా భక్తుల నుంచి డబ్బు లు దండుకుంటున్నారు. డబ్బులు ఇవ్వకుంటే దర్గాహ్ లోపలికి కూడా రానివ్వడం లేదు. ‘ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి. మాకేం కాదు’ అని మొహం మీదే చెబుతున్నారు. వక్ఫ్‌బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
 
కనీస సౌకర్యాలు కరువు
యేటా కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నా దర్గాలో భక్తుల కోసం వసతులు కరువయ్యూయి.   భక్తులకు విడిది కోసం విశ్రాంతి గృహాలు లేవు. స్నానం చేయడానికి, తాగడానికి నీరు లేదు. మూత్ర శాలలు లేవు. రోప్‌వే నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసినా అవి కనుమరుగయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.
 
నేటి నుంచి బడాపహాడ్ ఉర్సు
వర్ని : జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన బడాపహాడ్ దర్గా ఉర్సు గురువారం ప్రారంభం కానుంది. 30న జలాల్‌పూర్ నుంచి జొహర్ తర్వాత మధ్యాహ్నం ముజావర్ ఇంటి నుంచి సంధల్ (గంధం)తో ర్యాలీగా బయలు దేరుతారు. మే 1న  దీపారాధన, చిరాగ్ ఖవ్వాలి, 2న ఫజర్ తర్వాత తిలావత్ ఖురాన్-ఏ-పాక్, తబర్రుక్ పంచడంతో ఉత్సవాలు ముగుస్తాయి.
 
ప్రతిపాదనలు పంపించాం
బడాపహాడ్ తెలంగాణలోనే ఎంతో ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం. దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయా లి. బడాపహాడ్‌లో కొందరు భక్తులను దోచుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకే డబ్బులు తీసుకోవాలి. బడాపహాడ్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపించాం.
- జావీద్ అక్రం, వక్ఫ్‌బోర్డు జిల్లా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు