ఈ పోస్@: ఏపీ ఆన్‌లైన్ | Sakshi
Sakshi News home page

ఈ పోస్@: ఏపీ ఆన్‌లైన్

Published Fri, May 1 2015 5:30 AM

E- pass policy in Ration depots

ఏలూరు (టూ టౌన్) :రేషన్ సరుకులను ఈ-పోస్ విధానంలో పంపిణీ చేస్తున్న సర్కారు స్వల్ప మార్పులు చేసింది. మే నెల నుంచి జిల్లాలోని అన్ని రేషన్ డిపోల్లో ఈ-పోస్ విధానాన్ని అమలు చేయాలనుకున్న అధికారులు ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయి దా వేశారు. గత నెలలో మాదిరిగానే జిల్లాలోని 7 పురపాలక సంఘాలతోపాటు ఏలూరు నగరం, దెందులూరు మండలంలోని 606 రేషన్ డిపోల్లో ఈ-పోస్ విధానంలోనే సరుకులు పంపిణీ చేస్తారు. అయితే, గత నెలలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు ఈనెల నుంచి ఏపీ ఆన్‌లైన్ సర్వర్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ నెట్ (నిక్‌నెట్) సర్వర్‌ను వినియోగించారు. ఈ సర్వర్లు మొరాయిం చడం, తరచూ పనిచేయకపోవడం వంటి సమస్యలతో అటు రేషన్ కార్డుదారులు, ఇటు డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ దృష్ట్యా ఈ-పోస్ వేయింగ్ మెషిన్లను నిక్‌నెట్ సర్వర్ నుంచి తప్పించి, ఏపీ ఆన్‌లైన్ సర్వర్‌తో అనుసంధానించటం ద్వారా ఇబ్బందులను అధిగమించాలనే ఆలోచనకు అధికారులు వచ్చారు. దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరమే మిగిలిన మండలాల్లోని రేషన్ డిపోల్లో ఈ-పోస్ మెషిన్లు ఏర్పాటు చేస్తారు. దీనికి తోడు ఈ-పోస్ వేయింగ్ మెషిన్లు ప్రభుత్వం నుంచి జిల్లాకు రాలేదు. నిక్‌నెట్ సర్వర్ కంటే ఏపీ ఆన్‌లైన్ సర్వర్ వేగంగా పని చేస్తుందని, తద్వారా రేషన్ పంపిణీలో తలెత్తిన సమస్యలు తీరిపోతాయని అధికారులు భావిస్తున్నారు. మే నెలలో ఏపీ ఆన్‌లైన్ సర్వర్ పనితీరును పరిశీలించి.. వచ్చే నెలలో విడతల వారీగా ఇతర మండలాల్లోనూ ఈ-పోస్ విధానాన్ని ఆమలు చేయాలనే యోచనతో ఉన్నారు.
 

Advertisement
Advertisement