బొమ్మల బడి...అంగన్‌వాడీ

23 Feb, 2018 07:40 IST|Sakshi
అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి (ఫైల్‌)

ప్లే స్కూళ్లకు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాలు

పిల్లలకు ఆటవస్తులతో విద్యాభోదన

క్రమం తప్పకుండా పిల్లలకు పౌష్టికాహారం

మేడ్చల్‌రూరల్‌: చిన్నారులు మనను అనుకరిస్తూ మనలా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. పిల్లలు ఎదిగే దశలో మనను అనుసరిస్తూ నేర్చుకుంటారు. కానీ చాలా మంది పిల్లలు బొమ్మలతో ఆడుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. ప్రైవేటు ప్లే స్కూల్‌లకు దీటుగా ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఆటపాటలను నేర్పుతున్నారు. పిల్లలకు ఆటపాటలతో మనోవికాసం కలిగిస్తూ అంగన్‌వాడీ కేంద్రాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ఎటు చూసినా ఆట వస్తువులే...
అంగన్‌వాడీ కేంద్రాలలో ఎక్కడ చూసినా పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, గోడలకు బొమ్మల చిత్రాలే దర్శనమిస్తున్నాయి. అంగవాడీ కేంద్రం భవనం గోడలపై తెలుగు వర్ణమాల, కూరగాయలు, పండ్ల బొమ్మలు, మనిషి అవయవాల పటాలను ఏర్పాటు చేశారు. పండ్లు, కూరగాయలు, గుర్రం, వంటి వాహనాల నమూనా ప్లాస్టిక్‌ బొమ్మలతో చిన్నారులకు బోధన చేస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లు చిన్నారుల మధ్యలో కూర్చోని ఆటపాటలతో విద్యనందిస్తున్నారు. అదే విధంగా అంగన్‌వాడీ కేంద్రాలు ఐసీడీఎస్‌ నినాదాలతో, తెలుగు వర్ణమాల, ఆరోగ్యలక్ష్మి పథకం ఉద్దేశం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపే చార్టులతో కనిపిస్తున్నాయి.

మెనూ ప్రకారం..
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మెనూ ప్రకారం పోషకాహారాలను అందిస్తున్నారు. బాలామృతం, క్రమం తప్పకుండా ప్రతి రోజు భోజనంలో ఉడకబెట్టిన గుడ్లు, పోషకాహారాలను అందిస్తున్నారు. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పుతూ వారి భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు.

ఆటవస్తువులు పంపిణీ చేసిన భాస్కర్‌యాదవ్‌...
సీఎం కేసీఆర్, మేడ్చల్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిలజన్మదినం పురస్కరించుకుని ఇటీవలమేడ్చల్‌ జిల్లా గ్రంథాలయాల చైర్మన్‌ భాస్కర్‌యాదవ్‌ మండలంలోని 61 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేతుల మీదుగా ఉచితంగా అందజేశారు.

మరిన్ని వార్తలు