ఆన్‌లైన్‌లో ఆదివాసీ పెయింటింగ్‌లు 

4 Feb, 2019 03:10 IST|Sakshi
అమెజాన్‌ ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టిన గిరిజన కళాకారులు వేసిన చిత్రాలు  

అమెజాన్‌లో పెట్టిన పదింటిలో రూ.6,500 చొప్పున ఆరు విక్రయం

సాక్షి, ఏటూరు నాగారం: ఆదివాసీల పెయింటింగ్‌లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. గతంలో పెయింటింగ్‌లు వేసి కావాల్సిన వారికి విక్రయించే వారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ సదుపాయం పెరగడంతో ఆదివాసీ కళాకారులు వేసిన పెయింటింగ్‌లను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించేందుకు గిరిజన సంక్షేమశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ట్రైబల్‌ పెయింటింగ్‌ ఆఫ్‌ తెలంగాణ పేరుతో ఇప్పటి వరకు పది చిత్రాలను అమెజాన్‌లో విక్రయానికి పెట్టగా ఆరు అమ్ముడుపోయాయి. హైదరాబాద్‌ ట్రైబల్‌ మ్యూజియం క్యూరేటర్‌ సత్యనారాయణ సారథ్యంలో ఆదివాసీ కళాకారులు వేసిన పెయింటింగ్‌లను విక్రయించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా మేడారం మ్యూజియంలో కొంత మంది ఆదివాసీ కళాకారులకు పెయింటింగ్‌లు వేసేందుకు నిధులను సమకూర్చారు. దీంతో కొంత మంది కళాకారులు చిత్రాలు వేసి అమెజాన్‌లో విక్రయానికి పెట్టారు. ఒక్కో చిత్రానికి రూ.6,500 ధర నిర్ణయించారు. ఇలా వచ్చిన డబ్బును ఆదివాసీ కళాకారులకు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరికొంత పెట్టుబడికి సహకరిస్తే మరిన్ని చిత్రాలు తయారు చేసి విక్రయిస్తామని కళాకారులు పేర్కొంటున్నారు.  

స్టాల్‌ ఏర్పాటుకు చర్యలు.. 
ఆదివాసీ, గిరిజన కళాకారులు రూపొందించిన చిత్రా లను వారే స్వయంగా విక్రయించేందుకు ప్రత్యేక సంతలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు జిల్లా, మండల, రాష్ట్ర రాజధాని ప్రాంతాల్లో సంత (స్టాల్స్‌) వంటివి ఏర్పాటు చేసి వారే స్వయంగా వాటిని విక్రయించి వచ్చిన డబ్బును సమానంగా పంచుకు నేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

మరిన్ని వార్తలు