మద్దిలేటిని కోర్టులో హాజరుపర్చాలి

15 Oct, 2019 15:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీపీఐ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మక్తల్‌కు చెందిన తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాగ్‌లింగంపల్లిలోని టీపీఎఫ్‌ ఆఫీసులో ఓ రౌండ్‌టేబుల్‌ సమావేశానికి హాజరైన వీరిద్దరిని పోలీసులు నేరుగా కస్టడీలోకి తీసుకొన్నారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉండటమేగాక, చురుకైన కార్యకర్తలుగా పనిచేస్తూ.. కొత్త క్యాడర్‌ను నియమించడం, నిధులను సేకరించడం వంటివి చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

పట్టణ ప్రాంతాల్లో మావోయిస్ట్‌ పార్టీ నిర్వహించే బంద్‌లు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతిస్తున్నారని, అందుకే నిందితులను అరెస్ట్‌ చేశామని గద్వాల్‌ పోలీసులు పేర్కొన్నారు. దీంతో అరెస్ట్ చేసిన నలమాస కృష్ణ, మద్దిలేటిని కోర్టులో హాజరు పర్చాలని వారి బంధువులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.

మరిన్ని వార్తలు