నల్గగొండ: సూర్యాపేట బస్టాండ్ సమీపంలో మూడు రోజుల క్రితం పోలీసులపై కాల్పులు జరిపిన దోపిడీ దొంగలు హతమయ్యారు. శనివారం ఉదయం మోత్కూరు మండలం జానకీపురం శివారులో పోలీసులు ఎన్కౌంటర్ జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరు నిందితులు అక్కడికక్కడే హతం కాగా రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కాగా దుండగులు జరిపిన ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందగా, ఆత్మకూరు ఎస్ఐ సిద్ధయ్య, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. గత మూడు రోజులుగా సూర్యాపేట కాల్పుల ఘటన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం దుండగులు పోలీసులకు తారసపడ్డారు. పోలీసులను నుంచి తప్పించుకున్న వారు ఓ వ్యక్తిని బెదిరించి బైక్పై పరారయ్యారు. దాంతో పోలీసులు సినీ ఫక్కీలో దుండగులను ఛేజ్ చేసి హతమార్చారు. మృతులు సూర్యాపేట కాల్పుల ఘటన నిందితులుగా నిర్థారించారు.