మంత్రి వ్యాఖ్యలపై జనం ఆగ్రహం

25 Jun, 2018 03:00 IST|Sakshi
మంత్రి జగదీష్‌ రెడ్డి (ఫైల్‌ ఫొటో)

మూడు గంటల పాటు ఉద్రిక్తత.. 

మృతదేహాల అడ్డగింత

సాక్షి, యాదాద్రి : వేములకొండ దుర్ఘటనపై మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యా యి. వేములకొండలో పోస్టుమార్టం జరుగుతున్న పీహెచ్‌సీ వద్ద మృతుల బంధువులను పరామర్శించా క ఆయన మీడియాతో మాట్లాడుతుండగా, మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అనిల్‌కుమార్‌రెడ్డి, గ్రామస్తులు నినాదాలు చేశారు. ఆగ్రహించిన మంత్రి.. ‘రూ.15 లక్షలు సరిపోతాయా...? రూ.50 లక్షలు వద్దా?’ అని అనిల్‌తో వ్యంగ్యంగా అనడంతో వివాదం మొదలైంది. ‘మీలాంటి వాళ్లను చాలా మందిని చూశాం. బాధ్యతగా మెలగడం నేర్చుకోండి. శవాల మీద పేలాలు ఏరుతున్నారు. చచ్చినకాడ రాజకీయం చేస్తారా?’ అంటూ ఆందోళన చేస్తున్న వారిపైనా మంత్రి ఆగ్రహించడంతో వివాదం పెద్దదైంది.

కాంగ్రెస్‌ నాయకులను, గ్రామస్తులను పోలీసులు పక్కకు తీసుకెళ్లారు. మృతుల కుటుంబీకులతో చర్చించి రూ.2.5 లక్షల ప్రభుత్వ సాయం, సొంత స్థలం ఉన్న వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, స్థలం లేని వారికి స్థలంతోపాటు ఇల్లు, చదువుకునే పిల్లలుంటే కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని అనంతరం మంత్రి చెప్పారు. ఈలోపు గ్రామస్తులు, విపక్ష నేతలు గేటుకు అడ్డంగా బండరాళ్లు పెట్టి ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం చేసిన మృతదేహాలను బయటకు వెళ్లనీయలేదు. పరిహారం రూ.5 లక్షలు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని పట్టుబట్టారు. మంత్రి సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని మృతదేహాలను గ్రామానికి పంపారు. రూ.2.50 లక్షలు ప్రభుత్వం నుంచి, మరో లక్ష భువనగిరి ఎమ్మెల్యే నిధులు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇస్తామని మంత్రి ప్రకటించడంతో గ్రామస్తులు శాంతించారు. దీంతో సుమారు 3 గంటల పాటు కొనసాగిన ఉద్రిక్తతకు తెరపడింది. 

మరిన్ని వార్తలు