కలిసికట్టుగా పనిచేద్దాం

29 Dec, 2014 03:52 IST|Sakshi
కలిసికట్టుగా పనిచేద్దాం

ఖమ్మం : కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం నేతృత్వంలో కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తేవాలని మధిర, ఖమ్మం ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన ఐతం సత్యం సన్మాన సభ ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం జరిగింది. అంతకు ముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నయాబజార్ కళాశాల నుంచి బయల్దేరిన ఈ ప్రదర్శన భక్తరామదాసు కళాక్షేత్రం వరకు కొనసాగింది.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో కాంగ్రెస్‌లో పనిచేస్తున్న ఐతం సత్యం డీసీసీ అధ్యక్షుడిగా నియామకం పొందదం హర్షణీయమన్నారు. ఈయనకు ఉన్న అపార అనుభవం జిల్లా పార్టీ అభివృద్ధికి దోహద పడతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు ఆదేశాలనుసారం నడుచుకోవాల్సిన అవసరం పార్టీలోని ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమం విషయంలో పూటకో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ త్యాగాల చరిత్ర గల ఇందిరాగాంధీ కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు రుణపడి ఉంటారన్నారు. ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా తృణప్రాయంగా వదులుకున్న సోనియాగాంధీ ఆదర్శమూర్తి అని కొనియాడారు. ఆమె నాయకత్వంలో పనిచేస్తున్నందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు గర్వపడాలన్నారు. ఆమె ఆదేశాల మేరకు నియమితులైన ఐతం సత్యం నాయకత్వాన్ని గౌరవించాలన్నారు.  
 
అందరికీ అండగా ఉంటా : ఐతం
నలుబై ఏళ్లుగా  కాంగ్రెస్‌లో పనిచేస్తున్న తనకు అన్ని వర్గాల నాయకులతో పనిచేసిన అనుభవం ఉందని ఐతం సత్యం అన్నారు. ఏ ఒక్కరి వర్గానికి కాకుండా  కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అండగా ఉంటానన్నారు. తనను డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన సోనియాగాంధీకి, అందుకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిని కలిసి జిల్లాలో పార్టీ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు.

కార్యక్రమంలో పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పొన్నం వెంకటేశ్వర్లు, గ్రంథాలయం చైర్మన్ దుర్గాప్రసాద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొల్లు పద్మ, సేవాదళ్ అధ్యక్షుడు జావీద్, నాయకులు కూల్‌హోం ప్రసాద్, అశోక్, బాలాజీనాయక్, కక్కెర రాంమోహన్‌రావు, ఎస్‌ఏఎస్ అయ్యుబ్, మందడపు సత్యనారాయణ,  దోరెపల్లి రవికుమార్, సిరిపురం సుదర్శన్, రషీద్, నాగబత్తిని రవి, కిషోర్‌బాబు, రాంప్రసాద్, శరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చల్లారని అసమ్మతి!
ఐతం సత్యం సన్మాన సభకు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రేణుకాచౌదరితోపాటు పినపాక, భద్రాచలం, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనాయకులు హాజరుకాలేదు. దీంతో డీసీసీలో రాజుకున్న అసమ్మతి సెగలు చల్లారలేదనే విషయం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు