మాచర్ల రైల్వేలైన్‌ సాధిస్తాం 

9 Apr, 2019 20:34 IST|Sakshi

రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్‌రెడ్డి 

నాగర్‌కర్నూల్‌ క్రైం: కాంగ్రెస్, బీజేపీలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని, స్థానికేతరులైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను కాకుండా టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి రాములును అధిక మెజార్టీతో గెలిపిస్తేనే నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం బిజినేపల్లిలో రోడ్‌షో కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలో ప్రధాన అంశమైన మాచర్ల రైల్వేలైన్‌ హామీని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు నెరవేర్చలేకపోయాయని, ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే మాచర్ల రైల్వేలైన్‌ సాధించేందుకు కృషిచేస్తామన్నారు.

అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి రాములు అని గుర్తించి ఎంపీగా సీఎం కేసీఆర్‌ అవకాశం ఇచ్చారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తుందని, రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులను కొట్లాడి సాధించుకుంటామన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు స్థానికేతరులని, స్థానికుడైన తనను గెలిపిస్తే నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషిచేస్తానన్నారు.

రెండుసార్లు నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ ఎంపీగా గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమాత్రం కృషిచేయలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్‌ ఐదేళ్లలో చేశారన్నారు. ఎంపీ అభ్యర్థి రాములును నియోజకవర్గ ప్రజలు తనకు ఇచ్చిన 54 వేల మెజార్టీ కంటే అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. రోడ్‌షోలో పార్లమెంట్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ రఘునందన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ సభ్యురాలు సుధా పరిమళ, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు