నవభారత నిర్మాణంలో స్త్రీలే కీలకం

5 Nov, 2017 00:56 IST|Sakshi

ఫిక్కీ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో మహిళలు దూసుకెళ్లాలి

పంచాయతీల నుంచి చట్టసభల వరకు స్త్రీల ప్రాతినిథ్యం పెరగాలి

ప్రజల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలి

సాక్షి, హైదరాబాద్‌ :  నవభారత నిర్మాణంలో మహిళలదే కీలకపాత్ర అని, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో భారత మహిళలు దూసుకెళ్లా లని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌ తాజ్‌ దక్కన్‌ లో జరిగిన భారత వాణిజ్య పరిశ్రమల సమా ఖ్య(ఫిక్కీ) సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబనా తపన సమాజ ప్రగతికి సోపానమవుతుందని చెప్పా రు.

దేశం ఓ ప్రధాన ఆర్థికశక్తిగా మారుతున్న దశలో గాంధీ, అంబేడ్కర్, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పంచాయతీల నుంచి చట్టసభల వరకు స్త్రీల ప్రాతినిథ్యం పెరగాలని, అన్ని రంగాల్లో మహిళల అభ్యున్నతికి కృషి జరగాల ని, చట్టాల ద్వారా మాత్రమే మార్పు సాధ్యం కాదని, ప్రజల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా ఆడపిల్లలపై అత్యాచారాలు ఆగకపోవడానికి ఆ ఆలోచనా విధానంలో మార్పు రాకపోవడమే కారణమన్నారు. భారత సంస్కృతి స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నది ఒట్టిమాట అని, పురాణాల్లో, ఇతిహాసాల్లో స్త్రీల ప్రాధాన్యత మనకు స్పష్టమవుతుందన్నారు. ప్రధాని ప్రవేశపెట్టిన ‘బేటీ బచావో, బేటీ పడావో’కార్యక్రమం బాలబాలికల నిష్పత్తిలో అంతరాన్ని తగ్గించి, లింగ వివక్షకు స్వస్తి పలుకుతుందన్నారు. అంత్యోదయం మన సంస్కృతి అని, అంతిమ పంక్తిలో ఉన్న వారి అభివృద్ధికి మనందరం పునరంకితం కావాలని సూచించారు.

మాతృభాషను కాపాడుకోవాలి..
విదేశీయులు తమ భాషలను కాపాడుకుంటుంటే భారతీయులు మాత్రం మాతృభాష తెలుగును వదిలి ఆంగ్ల భాషకు ప్రాధాన్యత ఇస్తున్నారని, మాతృభాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వెంకయ్య చెప్పారు. రాష్ట్రంలో తెలుగుని తప్పనిసరిగా అభ్యసించాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని, ఆంధ్రప్రదేశ్‌ కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు.

వర్సిటీల్లో అఫ్జల్‌ గురు ఆశయాలను కొనసాగిస్తామని కొందరు ముందుకొస్తున్నారని, పార్లమెంట్‌పై దాడికి కుట్రపన్నడం అతని ఆశయమైనప్పుడు అతడిని సమర్థించడం మూర్ఖత్వం కాకమరేమౌతుందని ఆయన ప్రశ్నించారు. భారతమాతకి జై కొట్టడాన్ని తప్పుపడుతుండటం సరికాదని, భారతమాత అంటే భారతీయులందరికీ మేలు జరగడమేనన్నారు.

సత్తా చాటుకుంటున్న మహిళలు
కార్యక్రమానికి ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్‌పర్సన్‌ కామిని సరఫ్‌ స్వాగతం పలికారు. మహిళలు యుద్ధవిమానాలకు పైలట్లుగా ఉండటం దగ్గర నుంచి, రాజకీయ, పారిశ్రామిక క్రీడా రంగాలన్నింటా సత్తా చాటుకుంటున్నారని ఆమె అన్నారు.

మోదీ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న తరుణంలో గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌లో భారత్‌ 108వ స్థానంలో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో నవభారత నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలంటే మహిళల సాధికారతలోనూ, గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌లోనూ మెరుగ్గా ఉండాలన్నారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడిని, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీని కామిని సరఫ్‌ సన్మానించారు.


ఢిల్లీ ఖాళీ చేయాలని నా భార్యకు అప్పుడే చెప్పా
అనంతరం జరిగిన చర్చా గోష్టిలో వెంకయ్యనాయుడు తన భార్యతో అన్నమాటలను గుర్తుచేసుకున్నారు. మోదీ ప్రధాని అవబోతున్నప్పుడే తన భార్యను ఢిల్లీ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పానన్నారు. సమాజసేవ కోసం ఢిల్లీ నుంచి మనం వెళ్లాల్సి ఉంటుందని తన భార్య ఉషకి చెప్పానని తెలిపారు. మీడియాలో తన రాజకీయ భవిష్యత్తు గురించి రకరకాల వ్యాఖ్యానాలొచ్చినా తాను ఉషాపతిగా ఉండటానికే ఇష్టపడతానన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్‌ అయ్యాను కానీ ప్రజల నుంచి దూరం కాలేదని వెంకయ్య అన్నారు.

మరిన్ని వార్తలు