సెల్‌ టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

26 Aug, 2018 11:19 IST|Sakshi
సెల్‌ టవర్‌ ఎక్కిన యువకుడు

మడికొండ నల్గొండ: సెల్‌ టవర్‌ ఎక్కి ఓ యువకుడు హల్‌చల్‌ చేసిన సంఘటన మడికొండలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... మడికొండ గ్రామానికి చెందిన తాటి బద్రి అనే వ్యక్తి మడికొండ శివారులోని ప్రైవేట్‌ పాఠశాలలో పని చేస్తూ జీవనం కొసాగిస్తున్నాడు. పాఠశాల విధులకు సరిగా హాజరుకాకపోవడంతో యజమాన్యం బద్రిని విధుల నుంచి తొలగించారు. నాలుగు నెలల క్రితం ఇదే సెల్‌ టవర్‌ ఎక్కి పాఠశాల యజమాన్యం డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో స్థానిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌ మాట్లాడి ఇప్పిస్తానని హమీ ఇవ్వడంతో టవర్‌ దిగాడు. గత వారం రోజుల క్రితం కూడా టవర్‌ ఎక్కి బెదిరించడంతో స్థానికులు వారించి కిందకు దింపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఎవరికి చెప్పకుండా మడికొండ జాతీయ రహదారి పక్కన లోతుకుంట వద్ద ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని బద్రితో మాట్లాడినా... కిందకు దిగకపోవడంతో చేసేది లేక అక్కడే కాపాలా ఉన్నారు. సెల్‌ టవర్‌పై నిలబడుతూ.. కూర్చుంటూ రాత్రి 8 గంటల వరకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానికులు, వాహనదారులు భారీగా తరలివచ్చారు. అయితే స్థానికులను చూసి సెల్‌ టవర్‌పై ఇంకా ఎక్కువ చేస్తున్నాడని పోలీసులు అందరిని పంపించారు. ఇంట్లో ఏమైనా గొడవ అయిందా అని అడుగగా ఏమి గొడవ లేదు.. ఇంతకు ముందు ఇలాగే రెండు, మూడు సార్లు చేశాడని, మా పరువు తీసున్నాడని బద్రి భార్య రాధ భోరున విలపించింది. కాగా స్థానికులు, పోలీసులు దిగమని కోరడంతో శనివారం రాత్రి 9.50 గంటలకు బద్రి కిందికి దిగాడు.

మరిన్ని వార్తలు