ఏపీ సీఎంగా జగన్‌.. తెలంగాణలో సంబరాలు

30 May, 2019 14:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కేకులు కోసి, బాణాసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో దివంగత మహానేత వైఎ‍స్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు మల్లయ్య యాదవ్ నాయకులు, నరేష్, రమేష్, పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖమ్మం నగరంలో వైఎస్సార్‌సీపీ సంబరాలు అంబరాన్ని అంటాయి. కేక్ కట్ చేసి బాణసంచా కాలుస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ దార్ల అశోక్, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని ప్రగతి మహా విద్యాలయలో వైఎస్‌ జగన్‌ స్నేహితులు కేక్‌ కోసి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రొజెక్టర్‌ ద్వారా తెరపై వీక్షించి పులకించిపోయారు. వేడుకలతో ప్రగతి మహా విద్యాలయలో పండగ వాతావరణం నెలకొంది.

చెన్నైలో అన్నదానం
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు చెన్నైలో అన్నదానం చేశారు. వెయ్యి మందికి పైగా బిర్యానీ పంచారు. వైఎస్సార్‌సీపీ నేతలు దువ్వూరి సురేష్ రెడ్డి, కడివేటి గోపాలకృష్ణా రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు