రాష్ట్రంలో మూడు ఈఎస్‌ఐ వైద్యశాలల ఏర్పాటు

18 Aug, 2015 19:40 IST|Sakshi

మార్కాపురం(ప్రకాశం జిల్లా): త్వరలో రాష్ట్రంలో ఈఎస్‌ఐ వైద్యశాలలను విజయనగరం, గుంటూరు, కాకినాడల్లో ఏర్పాటు చేస్తున్నామని ఈఎస్‌ఐ వైద్యశాలల జాయింట్ డైరెక్టర్ జి.రవికుమార్ తెలిపారు. స్థానిక ఈఎస్‌ఐ వైద్యశాలను మంగళవారం తనిఖీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. విజయనగరంలో 200 పడకలు, కాకినాడ, గుంటూరుల్లో వంద పడకల వైద్యశాలలు కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రస్తుతం ఏపీలో 75 ఈఎస్‌ఐ వైద్యశాలలున్నాయని, వీటిల్లో 50 వైద్యశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, రెవెన్యూ అధికారులు స్థలాలు కేటాయిస్తే వెంటనే భవనాలు నిర్మించుకుంటామని చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోని, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో డయాగ్నోసిస్ సెంటర్లు ఉన్నాయని, 10 పడకలు మాత్రమే ఇక్కడ ఉంటాయన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రిలలో ప్రాంతీయ వైద్యశాలలు ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 10 మంది సభ్యులకు గాను ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉంటారని తెలిపారు.

మరిన్ని వార్తలు