చేతులెత్తేసిన కృష్ణా త్రిసభ్య కమిటీ!

8 Dec, 2016 02:25 IST|Sakshi
చేతులెత్తేసిన కృష్ణా త్రిసభ్య కమిటీ!

తేలని నీటి కేటాయింపులు
రెండు తెలుగు రాష్ట్రాలు పట్టవదలకపోవడంతో తల పట్టుకున్న బోర్డు
పూర్తి బోర్డు సమావేశం నిర్వహణకు యోచన

సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ విషయంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ పూర్తిగా చేతులెత్తేసింది. నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో బోర్డు సభ్య కార్యదర్శి విడివిడిగా చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం రాకపోవడంతో ఇక పూర్తి స్థాయి సమావేశంలోనే దీన్ని తేల్చాలనే ఉద్దేశంతో బోర్డు ఉంది. గురువారం ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించిన తర్వాత పూర్తి సమావేశంపై బోర్డు స్పష్టత ఇవ్వనుంది. ప్రస్తుత రబీ అవసరాలకు గానూ తెలంగాణ 103 టీఎంసీలు కోరుతుండగా, ఏపీ 107 టీఎంసీలు అడుగుతోంది. అయితే కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో మాత్రం లభ్యత జలం 130 టీఎంసీల మేర మాత్రమే ఉంది.

ఈ 130 టీఎంసీల్లో తెలంగాణకు కేవలం 30 టీఎంసీలు మాత్రమే దక్కుతాయని ఏపీ వాదిస్తుండగా, గరి ష్టంగా 74 టీఎంసీలు, కనిష్టంగా 56 టీఎం సీలు దక్కుతాయని తెలంగాణ అంటోంది. దీనిపై పది రోజుల కిందటే బోర్డు సభ్య కార్యదర్శి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చర్చించినా ఇంతవరకూ ఓ నిర్ణయానికి రాలేదు. దీంతో బోర్డు సభ్య కార్యదర్శి విడిగా రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషితో చర్చిం చినా, తమకు 50 టీఎంసీలకు తక్కువ కాకుండా చూడాలని స్పష్టం చేశారు. దీనిపై ఏపీతో చర్చించగా, 50 టీఎంసీలు ఇచ్చేం దుకు సానుకూలత వ్యక్తంచేయలేదు.

దీంతో చర్చలు అసంపూర్తిగా మిగిలాయి. ఈఎన్‌సీల స్థాయిలో మళ్లీ చర్చలు జరిపినా పరిష్కారం దొరకడం కష్టమని భావిస్తున్న బోర్డు, పూర్తి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను కొలిక్కి తేవాలని యోచిస్తోంది. కాగా ఇరు రాష్ట్రాలు తమ రబీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని బోర్డు అనుమతి లేకున్నా, సాగర్ ఎడమ కాల్వ ద్వారా తెలంగాణ, హంద్రీనీవా ద్వారా ఏపీ.. నీటిని విడుదల చేసి వినియోగం మొదలు పెట్టాయి.

మరిన్ని వార్తలు