మహిళలపై కాంగ్రెస్‌ నేత దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు!

28 Mar, 2017 16:13 IST|Sakshi

త్రివేండ్రం: మహిళలపై కేరళ కాంగ్రెస్‌ నేత ఎంఎం హసన్‌ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. రుతుస్రావం సమయంలో మహిళలు మలినంగా ఉంటారని, కాబట్టి వారిని ఆధ్యాత్మిక ప్రదేశాల్లోకి అనుమతించకూడదని పేర్కొన్నారు.

'రుతుస్రావం అనేది మలినమైనది. ఈ సమయంలో మహిళలను ఆలయాల్లోకి రానివ్వకూడదు. ఈ సమయంలో మహిళలకు రాకూడదన్న సూచన వెనుక సైంటిఫిక్‌ కారణం ఉంది. దీనిని తప్పుగా వ్యాఖ్యానించకూడదు. ఈ సమయంలో మహిళలు ఉపవాసం ఉండకూడదు. నా అభిప్రాయం ప్రకారం మహిళల శరీరం మలినంగా ఉన్నప్పుడు వారు ఆలయాలు, మసీదులు, చర్చిల వంటివాటికి వెళ్లకపోవడమే మంచిది' అని ఆయన పేర్కొన్నారు. కేరళ పీసీసీ చీఫ్‌గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. గతకొంతకాలంగా ఖాళీగా ఉన్న కేరళ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవిని తనకు సన్నిహితుడైన ఎంఎం హసన్‌కు మాజీ సీఎం ఊమెన్‌ చాందీ పట్టుబట్టి మరీ ఇప్పించారు.
 

మరిన్ని వార్తలు