జంగ్‌తో కేజ్రీవాల్ భేటీ

11 Jun, 2015 01:33 IST|Sakshi
జంగ్‌తో కేజ్రీవాల్ భేటీ

అధికారాల విషయంలో పరస్పర సహకారంపై చర్చ
* కొత్త న్యాయశాఖ మంత్రిగా కపిల్ మిశ్రా
* పోలీస్ కస్టడీలో తోమర్ విచారణ ప్రారంభం

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీ అధికార వ్యవస్థలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో బుధవారం భేటీ అయ్యారు.

నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల ఆరోపణలతో అరెస్టయిన జితేందర్‌సింగ్ తోమర్ మంత్రిపదవికి రాజీనామా చేయటంతో ఆయన స్థానంలో ఢిల్లీ జలబోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే కపిల్ మిశ్రాను న్యాయ మంత్రిని చేయాలని  కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్‌కు సమాచారమిచ్చారు. ఇద్దరూ పరస్పర సహకారంతో పనిచేసేందుకు ఉన్న మార్గాలపై ఎల్‌జీ, కేజ్రీవాల్ చర్చించినట్లు సమాచారం. కేజ్రీవాల్‌తో తాను సమావేశమయ్యానని తనకు న్యాయశాఖ అప్పగించనున్నట్లు తెలిపారని కపిల్ మిశ్రా తెలిపారు. మిశ్రా నియామకానికి సంబంధించి గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, కేజ్రీవాల్ బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ భేటీ అయ్యారు. ఢిల్లీ అంశాలపై చర్చించినట్లు సమాచారం.
 
ఫైజాబాద్‌కు తోమర్..: సోమవారం తమ కస్టడీలోకి తీసుకున్న మాజీ మంత్రి తోమర్‌ను నకిలీ సర్టిఫికెట్ విచారణలో భాగంగా పోలీసులు ఫైజాబాద్ తీసుకెళ్లారు. ఇది కేవలం తోమర్ సర్టిఫికెట్ వ్యవహారమే కాదని, దీని వెనుక అతి పెద్ద నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల రాకెట్ ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. ఫైజాబాద్‌లోని అవధ్ వర్సిటీకి తోమర్‌ను అధికారులు తీసుకెళ్లారని, ఆయన సాయంతో అక్కడ కేసు ఆధారాలను సేకరిస్తారని ఢిల్లీ పోలీసులు  తెలిపారు.  తోమర్ తమ నుంచి ఎలాంటి డిగ్రీ పొందలేదని అవధ్ వర్సటీ ఓ ఆర్టీఐ దరఖాస్తుకిచ్చిన జవాబులో తెలిపింది.
 
ఒక రాష్ట్రం..  ఇద్దరు హోం సెక్రటరీలు

ఒకే కార్యాలయం.. ఒకే పదవి.. అధికారులు మాత్రం ఇద్దరు.. ఇద్దరూ విధులు నిర్వర్తించారు.  మరి సిబ్బంది ఎవరి మాట వినాలి? ఒకరేమో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆమోదమున్న అధికారి. మరొకరేమో సాక్షాత్తూ సీఎం నియమించిన అధికారి.. ఢిల్లీలో ఈ సంకటం నెలకొంది. ఢిల్లీ హోం శాఖలో కార్యదర్శి పదవిలో ఇద్దరు అధికారులు ఒకేసారి విధులు నిర్వర్తించారు. అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారి నియామకం నేపథ్యంలో ఎల్‌జీ ఆదేశాలను పాటించిన ఢిల్లీ హోం కార్యదర్శి ధరమ్‌పాల్‌ను ఆప్ సర్కారు బదిలీ చేసి మరో  అధికారి రాజేంద్ర కుమార్‌ను ఆ పదవిలో నియమించింది. అయితే  పాల్ బదిలీ చెల్లదని.. ఎల్జీ చెప్పటంతో.. బుధవారం ఇద్దరు అధికారులూ తానే హోం కార్యదర్శినంటూ విధులు నిర్వర్తించారు

మరిన్ని వార్తలు