దేశం కాని దేశంలో.. చంపి, తగలబెట్టాడు!!

22 Feb, 2014 20:16 IST|Sakshi

ఇద్దరూ దేశం కాని దేశం వెళ్లారు. ఒకే దేశం నుంచి వెళ్లామన్న సొంత భావన కూడా లేకుండా కొట్టి చంపడమే కాక, మృతదేహాన్ని కూడా కాల్చేశాడో భారతీయుడు. ఈ దారుణం దుబాయ్లో జరిగింది. అతడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతడి వివరాలు ఇంకా తెలియలేదు. అతడు మాత్రం తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు, బాధితుడు వేర్వేరు ఉద్యోగాలు చేస్తారని, తన ఇంటికి పిలిచి మరీ అతడిని హత్యచేశాడని పోలీసులు చెప్పారు.

అతడి ఇంటి మేడమీద బాగా కాలిపోయి ఉన్న మృతదేహం పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులకు లభ్యమైంది. ఎప్పుడో ఇద్దరి మధ్య జరిగిన గొడవను మనసులో పెట్టుకుని, చంపే ఉద్దేశంతోనే పిలిచాడని పోలీసు ప్రతినిధి నవాఫ్ అల్ బౌక్ తెలిపారు. ముందుగా తాను అతడిని ఇనుప రాడ్తో పదే పదే తలమీద కొట్టానని, చనిపోయిన తర్వాత మేడ మీదకు తీసుకెళ్లి తగలబెట్టానని నిందితుడు పోలీసుల వద్ద అంగీకరించాడు. మృతదేహాన్ని గుర్తుపట్టడం కూడా ఎవరికీ సాధ్యం కావట్లేదు. అయితే నేరం జరిగిన 24 గంటల్లోగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

>
మరిన్ని వార్తలు