ఆ ఎంపీకి ఎయిరిండియా షాక్‌!

28 Mar, 2017 16:21 IST|Sakshi
ఆ ఎంపీకి ఎయిరిండియా షాక్‌!

న్యూఢిల్లీ: తన విమానంలో 60 ఏళ్ల మేనేజర్‌పై దాడి చేసి అత్యంత దురుసుగా ప్రవర్తించిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు ప్రభుత్వ విమానాయాన సంస్థ ఎయిరిండియా షాక్‌ ఇచ్చింది. ఎంపీ గైక్వాడ్‌ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు తాజాగా ఎయిరిండియా టికెట్‌ బుక్‌ చేశారు. వెంటనే ఆ టికెట్‌ను ఎయిరిండియా రద్దు చేసింది.

బుధవారం ఉదయం ఎయిరిండియా విమానంలో వెళ్లేందుకు ఓపెన్‌ టికెట్‌ను గైక్వాడ్‌ కొనుగోలు చేశారు. అయితే, గత గురువారం పుణె-న్యూఢిల్లీ విమానంలో తనకు బిజినెస్‌ క్లాస్‌ను నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన గైక్వాడ్‌ ఎయిరిండియా మేనేజర్‌ ఆర్‌ సుకుమార్‌పై దాడి చేశాడు. అతడిని చెప్పుతో 25సార్లు కొట్టాడు. ఎంపీ దుష్ర్రవర్తన ఎయిరిండియాను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో గైక్వాడ్‌పై ఎయిరిండియా సహా ఐదు ప్రైవేటు విమానాయాన సంస్థలు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానం టికెట్‌ కొనుగోలు చేసి గైక్వాడ్‌కు షాక్‌ ఇస్తూ.. ఆయన టికెట్‌ను రద్దు చేసింది. ఆయన టికెట్‌ కొనుగోలుకు ప్రయత్నించినా.. సీటు అలాట్‌ చేయవద్దని అన్ని కాల్‌ సెంటర్లకు ఎయిరిండియా ఆదేశాలు ఇచ్చింది.

మరిన్ని వార్తలు