జీఎస్‌టీని సాకారం చేస్తాం..

4 Apr, 2016 00:25 IST|Sakshi
జీఎస్‌టీని సాకారం చేస్తాం..

రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌కు ఇక తావులేదు...
భారత్‌లో పెట్టుబడులు పెట్టండి...
సౌదీ పర్యటనలో ఇన్వెస్టర్లకు {పధాని మోదీ పిలుపు

 

రియాద్: భారత్‌లో వ్యాపారాలకు మరింత అనువైన పరిస్థితులను కల్పిస్తామని, స్థిరమైన పన్నుల విధానాన్ని అమలు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇన్వెస్టర్లకు హామీనిచ్చారు. రెట్రోస్పెక్టివ్ పన్నులు(కంపెనీల పాత లావాదేవీలపైనా పన్ను విధింపు) గతించిన అంశమని కూడా పేర్కొన్నారు. అయితే, రెండు కంపెనీలకు సంబంధించి(వొడాఫోన్, కెయిర్న్) నెలకొన్న పన్ను వివాదాలు గత ప్రభుత్వ హయాంలోనే మొదలయ్యాయని, ఈ ఉదంతం కోర్టుల పరిధిలో ఉన్నందున తామేమీ చేయలేకపోతున్నామని మోదీ చెప్పారు.

 సౌదీ అరేబియా రెండు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఆదివారమిక్కడ  వ్యాపారవేత్తలతో సమావేశం సందర్భంగా ప్రధాని ఈ విషయాలను ప్రస్తావించారు. కీలకమైన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ల వ్యవస్థ త్వరలోనే సాకారమవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందన్నది మాత్రం ఆయన చెప్పలేదు. తమ ప్రభుత్వం పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ) ద్వారాలు తెరిచిందని.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ, భారత్ మాత్రం మెరుగైన వృద్ధి రేటును సాధిస్తోందని ప్రధాని వివరించారు. ప్రధానంగా రక్షణ, ఇంధన, రైల్వే, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో అపార అవకాశాలున్నాయని.. వీటిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మోదీ సౌదీ వ్యాపార దిగ్గజాలకు పిలుపునిచ్చారు.

 
పాలనాపరమైన అడ్డంకులను తొలగించడం, కీలకమైన పాలసీ చర్యల ద్వారా ఇన్వెస్టర్లకు భారత్‌ను అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చామని ప్రధాని చెప్పారు. మొండిబకాయిల సమస్యలను పరిష్కరించడం ద్వారా భారత్‌లో బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు.

 వాణిజ్య బంధం బలపడాలి...: ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంచుకోవడానికి అపారమైన అవకాశాలున్నాయన్నారు. ‘కేవలం కొనుగోలు-అమ్మకందారుల మధ్య ఉండే సంబంధాన్ని మేం కోరుకోవడంలేదు. ఇరు దేశాల ప్రజలకూ ప్రయోజనం కలిగించేవిధంగా సరికొత్త అభివృద్ధి మార్గంలో పయనించాలని భావిస్తున్నా’ అని కౌన్సిల్ ఆఫ్ సౌదీ చాంబర్స్ నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పేర్కొన్నారు. సముద్రగర్భ చమురు నిక్షేపాల వెలికితీత, డిఫెన్స్, రైల్వే రంగాల్లో జాయింట్ వెంచర్స్‌తో పాటు టెక్నాలజీ బదలాయింపునూ భారత్ కోరుకుంటోందన్నారు. ఎరువులు, సౌర విద్యుత్ యంత్రాల తయారీతో పాటు శీతల గిడ్డంగుల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టొచ్చని సౌదీ ఇన్వెస్టర్లకు మోదీ సూచించారు.

 

 
టీసీఎస్ ‘మహిళా’ క్యాంపస్ సందర్శన
సౌదీ పర్యటనలో భాగంగా రియాద్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు ఉన్న మహిళా బీపీఓ కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఇది మొత్తం మహిళలతోనే నడుస్తున్న మొట్టమొదటి క్యాంపస్ కావడం విశేషం. మోదీకి టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, టీసీఎస్ ఎండీ-సీఈఓ ఎన్. చంద్రశేఖరన్‌తో పాటు ఈ కేంద్రంలో ఉన్న 1,000 మందికిపైగా మహిళా ఐటీ నిపుణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళా ఐటీ నిపుణులతో మాట్లాడమే కాకుండా సెల్ఫీలు కూడా తీసుకున్నారు. వారిని భారత్‌కు ఆహ్వానించారు. ‘సౌదీ అరేబియా కీర్తి ప్రతిష్టలకు నిలువుటద్దంలా నిలుస్తున్న ఈ మహిళా ఐటీ నిపుణులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బహుశా రియాద్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నేటి ప్రధాన వార్త ఇదే అవుతుందేమో’ అని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అభివృద్ధి ప్రక్రియలో మహిళలకు సంపూర్ణ భాగస్వామ్యం కల్పించే ఏ దేశమైనా అత్యంత వేగంగా పురోగమిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడి బీపీఓ కార్యకలాపాల్లో పనిచేస్తున్న 1,000 మంది మహిళల్లో 85 శాతం సౌదీకి చెందినవారే కావడం గమనార్హం.

 

మరిన్ని వార్తలు