చారిత్రక సౌధం..

2 Apr, 2017 07:19 IST|Sakshi
హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీలో ఉన్న ఎస్‌బీహెచ్‌ ప్రధాన కార్యాలయం

పేరు మారనున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ భవనం
నేటి నుంచి ఎస్‌బీహెచ్‌ కనుమరుగు
75 ఏళ్ల క్రితం ప్రారంభమైన బ్యాంకింగ్‌ సేవలు
ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఏడో నిజాం
అతి పెద్ద భారతీయ బ్యాంకులో విలీనమైన సేవలు


సాక్షి, హైదరాబాద్‌: సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆశల సౌధం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌. ఏడో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ బ్యాంకు ఇక కనుమరుగు కానుంది. శనివారం నుంచి ఎస్‌బీఐలో విలీనమవుతోంది. లక్షల మంది ఖాతాదారులతో, శాఖోపశాఖలుగా విస్తరించిన ఎస్‌బీహెచ్‌ సేవలు ఇక కొత్త రూపు సంతరించు కోనున్నాయి. ఏడున్నర దశాబ్దాల హైదరాబాద్‌ లోని గన్‌ఫౌండ్రిలో కట్టించిన ‘హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌’చారిత్రక సౌథం ఇక నుంచి ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’గా సేవలందజేయనుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం..

ఎంతో ఘన చరిత్ర..
హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌ చట్టం కింద 1941లో గన్‌ఫౌండ్రిలో ఈ బ్యాంకును నిర్మించారు. సువిశాల ప్రాంగణం.. పెద్ద హాళ్లు.. ఇండో యూరోపి యన్‌ నిర్మాణ శైలిలో అత్యద్భుతంగా కట్టించిన ఈ భవనం బ్యాంకింగ్‌ రంగంలోనే వినూత్నంగా నిలి చింది. అప్పటి వరకు నిజాం ప్రభుత్వం లో సెంట్రల్‌ బ్యాంకింగ్‌ విధానం లేదు. ప్రజల సొమ్ముకు రక్షణ లేదు. రిజర్వ్‌బ్యాంకు అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం అధీనంలో ఉంది. ఈ క్రమంలో నిజాం సంస్థానంలో హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంకును ఏర్పాటు చేశారు.

1942 ఏప్రిల్‌ 5 నుంచి ఈ బ్యాంకు సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి కరెన్సీ ‘ఉస్మానియా సిక్కా’. ఈ కరెన్సీలోనే బ్యాంకు కార్యకలాపాలు కొనసాగాయి. హైదరాబాద్‌ సంస్థానం ఇండియాలో విలీనమయ్యాక ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’గా పేరు పెట్టారు. 1950 నాటికి 50 శాఖలతో సేవలు అందజేసిన ఎస్‌బీహెచ్‌ ఇప్పుడు 2,000 బ్రాంచ్‌లను కలిగి ఉంది. గన్‌ఫౌండ్రి బ్రాంచ్‌లో 20 వేల మంది ఖాతాదారులున్నారు. ఆసియాలోనే అతిపెద్ద లాకర్స్‌ వ్యవస్థ ఇందులోనే ఉంది. 75 ఏళ్ల ఘన చరిత్రను ప్రతిబింబించేలా ప్లాటినం జూబ్లీ వేడుకలు ఇటీవల జరిగాయి. ఈ కట్టడానికి వారసత్వ భవనంగా గుర్తింపు కూడా లభించింది.


ఇన్నేళ్ల ప్రేమతో..
దశాబ్దాలుగా ఎస్‌బీహెచ్‌ ఉద్యోగులుగా, అధికారులు గా పనిచేసిన ఎంతోమంది శుక్రవారం గన్‌ఫౌండ్రీ లోని ప్రధాన కార్యాలయం వద్ద తమ అనుభవాలను, బ్యాంకుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సెల్ఫీలు, గ్రూప్‌ ఫొటోలు తీసుకున్నారు. ఇక నుంచి ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ ఉండబోదనే కఠోర వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ విలీనాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ‘కన్నతల్లి నుంచి దూరం చేసినట్లుగా ఉంది’అంటూ పలువురు ‘సాక్షి’తో తమ ఆవేదన వ్యక్తం చేశారు.

సామాన్యుల సేవలో..
ఎస్‌బీహెచ్‌ కార్యకలాపాలన్నీ సామాన్య, మధ్యతరగతి వర్గాలతోనే ముడిపడి ఉన్నాయి. ప్రజల నుంచి సేకరించిన సొమ్మును రైతులు, చిరు వ్యాపారులు, మధ్యతరహా వ్యాపార వర్గాలకు రుణాల రూపంలో అందజేయడం ద్వారా వారి అభ్యున్నతికి బ్యాంకు సేవలు దోహదం చేశాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి నిజాం హయాంలోని తెలంగాణ, కర్ణాటక, గుల్బర్గా, మరఠ్వాడాలో ఎస్‌బీహెచ్‌ సేవలు విస్తరించాయి.

ఉద్యోగుల భద్రతపై స్పష్టత లేదు..
ఉద్యోగుల భద్రతపై ఎలాంటి స్పష్టతా లేదు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌పైనా స్పష్టత ఇవ్వలేదు. పెన్షన్, గ్రాట్యుటీ, పీఎఫ్‌ విషయాల్లో ప్రస్తుతం ఎస్‌బీహెచ్‌పాలసీ వర్తించకపోతే ఉద్యోగులు చాలా నష్టపోతారు. విలీనం బాధగానే ఉంది.
– శైలేంద్ర లిమాయె, బ్యాంకు ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు

ఇది ప్రజల బ్యాంకు..
ఇప్పటి వరకు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజల బ్యాంకుగా గుర్తింపు పొందింది. సేవలందజేసింది. చిన్న మొత్తాలు రుణాలు అందజేశాం. దానివల్ల లక్షలాది మందికి లబ్ధి చేకూరింది. భవిష్యత్తులో అలా ఉండకపోవచ్చేమో..
– టీవీ జయలక్ష్మి, బ్యాంకు ఉద్యోగి

కన్నతల్లి నుంచి విడిపోతున్నట్లుంది
30 ఏళ్లుగా బ్యాంకులో పని చేస్తున్నా. ఇక ముందు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఉండబోదంటే జీర్ణించుకోలేక పోతున్నాను. కన్నతల్లి నుంచి దూరం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇక మా ఉనికిని కోల్పోయినట్లే కదా అనిపిస్తోంది.
– కేకేవీ ప్రసాద్, ఉద్యోగ సంఘం నాయకుడు

మరిన్ని వార్తలు