ఆ శకలం గల్లంతైన విమానానిదేనా?

23 Jul, 2016 20:33 IST|Sakshi
ఆ శకలం గల్లంతైన విమానానిదేనా?

సాక్షి, చెన్నై : బంగాళాఖాతంపై అదృశ్యమైన ఏఎన్-32 ఎయిర్‌ఫోర్స్ విమానం కోసం అన్వేషణ తీవ్రతరమైంది. అయితే చెన్నైకి 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఓ వస్తువు లభించినట్లు సమాచారం. అది విమాన శకలమా లేక మరొకటా అనేది తెలియాల్సిఉంది. వస్తువు లభించిన ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్వయంగా సెర్చ్ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. ఏఎన్-32 ఎయిర్‌ఫోర్స్ విమానం  ఆచూకీ కోసం భారత నౌకాదళం, కోస్టుగార్డు, వైమానిక దళం వర్గాలు జలాంతర్గామి, ఎనిమిది విమానాలు, 18 నౌకలతో ఆచూకీ కోసం అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. గల్లంతైన విమానంలో ప్రయాణించిన 29 మంది జాడ కోసం వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.

రక్షణ మంత్రి పర్యవేక్షణ:
ఏఎన్ -32 గల్లంతు సమాచారంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శనివారం ఉదయమే తమిళనాడుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అరక్కోణం వైమానిక దళానికి, అక్కడ అదృశ్యమైన విమానానికి సంబంధించి సిద్ధం చేసిన ఫొటోలను పరిశీలించారు. గాలింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాలింపులో సాంకేతిక పరిజ్ఞానం, ఆ విమానానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బంగాళాఖాతంలో ఏఎన్-32 విమానంతో సంబంధాలు తెగినట్టుగా భావిస్తున్న ప్రదేశం వరకు పర్యటించారు. గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షించారు.

తదుపరి తాంబరం ఎయిర్‌బేస్‌కు చేరుకుని వైమానిక, నౌకాదళం వర్గాలతో చర్చించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి పర్యవేక్షణలో ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించినట్టు సమాచారం. ఈ కమిటీ ప్రాథమిక విచారణ ప్రారంభించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో వైమానిక, నౌకాదళం వర్గాలతో పాటు, సాంకేతిక నిపుణుల్ని నియమించినట్టు తెలిసింది. చెన్నై నుంచి బయలుదేరిన విమానంలో చెన్నైకు చెందిన ముత్తుకృష్ణన్ అనే వ్యక్తి ఉన్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు