కొత్త నోట్లలో మరో విశేషం

19 Nov, 2016 15:37 IST|Sakshi
కొత్త నోట్లలో మరో విశేషం

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా దేశంలో సంచలనం సృష్టించిన భారత కరెన్సీ వెనక ఎంతో ఆసక్తిదాయకమైన కథనం ఉంది. బ్రిటీష్ కాలం నుంచి మోదీ హయాం వరకు సాగిన నోట్ల మహాప్రస్థానంలో ఆనేక మలుపులున్నాయి. బ్రిటిష్ కాలంలో పురుడు పోసుకున్న మన నోటుపై ‘మేక్ ఇన్ ఇండియా’ ముద్రవేసింది సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీనే. నోట్ల ముద్రణకు  తగిన పేపర్, సిరా, సెక్యూరిటీ ఫీచర్స్ అవసర మవుతాయికనుక కరెన్సీ ముద్రించడం కూడా ఖర్చుతో కూడుకున్నదేనని అందరికే తెల్సిందే. నేడు డెన్మార్క్ నుంచి కువైట్ వరకు పలు దేశాల తమ నోట్ల ముద్రణకు విదేశాలపైనే ఆధారపడుతున్నాయి.

భారత్ కూడా మొన్నటి వరకు కరెన్సీ ముద్రణకు విదేశాలపైనే ఆధారపడింది. వీటి ముద్రణకు అవసరమైన కాగితంలో 95 శాతాన్ని బ్రిటన్‌లోని ‘థామస్ డీ లా రూ’, జర్మనీలోని ‘గీసెక్ డెవ్రియంట్’, కెనడాలోని మరో పేపర్ మిలు ్లనుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే పలు అంతర్జాతీయ కంపెనీలను దేశంలోకి ఆకర్షించడం కోసం ‘మేక్ ఇన్ ఇండియా’  నినాదాన్ని తీసుకొచ్చిన విషయం తెల్సిందే. ఆయన 2015లో ఆర్‌బీఐ అధికారులను పిలిచి ‘మేక్ ఇన్ ఇండియా’ అని మనం పిలుపునిస్తూ  మరోపక్క దేశ కరెన్సీ ముద్రణకు విదేశీ కంపెనీల నుంచి దిగుమతి చేసుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదని వాదించారు. కరెన్సీకి అవసరమైన కాగితాన్ని మన దేశంలోనే తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను అప్పటికప్పుడే ఆదేశించారు.

మోదీ ఆదేశంతోనే రెండో పేపర్ మిల్లు

ఫలితంగా ప్రస్తుతం కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న కర్ణాటకలోని మైసూర్ ప్రెస్‌కు సమీపంలోనే మైసూర్ పేపర్ మిల్లును కొత్తగా ఏర్పాటు చేశారు. 22 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల ఈ మిల్లు ఉత్పాదన కూడా ప్రారంభించింది. ఇంతవరకు దేశంలో కాగితాన్ని ఉత్పత్తిచేసే ప్రభుత్వ సెక్యూరిటీ ప్రెస్ మధ్యప్రదేశ్‌లోని హోశాంగబాద్‌లో ఒకటి మాత్రమే ఉంది. 2,800 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంగల ఆ మిల్లు ఉత్పత్తి చేస్తున్న కాగితం మన కరెన్సీ అవసరాలకు సరిపోక పోవడంతో విదేశాల నుంచే ఎక్కువ తెచ్చుకుంటున్నాం. 1968లో ఈ పేపర్ మిల్లును ఏర్పాటు చేయగా, దాదాపు యాభై ఏళ్ల తర్వాత, అదీ మోదీ హయాంలో  రెండో సెక్యూరిటీ పేపర్ మిల్లు ఏర్పాటయింది. ఈ రెండు మిల్లులు ఉత్పత్తి చేసే కాగితం మన కరెన్సీ అవసరాలకు సరిపోతుందట. ప్రభుత్వం కొత్తగా ముద్రించిన 2000, 500 రూపాయల నోట్లకు ఎక్కువగా మన పేపర్‌నే వాడారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీని వల్ల ఏటా పేపర్ దిగుమతికి అవుతున్న 1500 కోట్ల రూపాయలు మిగులుతాయని ఆ వర్గాలు తెలిపాయి. 

భారత కరెన్సీ పుట్టుక

భారత దేశంలో బ్రిటిష్ పాలకులు మొట్టమొదటి సారిగా దేశీయ కరెన్సీని 1862లో ప్రారంభించారు. అయితే ఆ నోట్లను బ్రిటన్లో ముద్రించి దేశానికి తీసుకొచ్చేవారు. ఆ తర్వాత భారత్ కరెన్సీని భారత్‌లోనే ముద్రించాలని నిర్ణయించి 1926లో మహారాష్ట్రలోని నాసిక్‌లో ప్రభుత్వ సెక్యూరిటీ ప్రెస్ భవనం నిర్మాణాన్ని చేపట్టారు. అది 1928 నుంచి కరెన్సీ ముద్రణను ప్రారంభించి అప్పటికి అమల్లో ఉన్న ఐదు రూపాయల నోటును అదే డిజైన్‌తో ముద్రించింది. ఆ తర్వాత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం నోట్ల డిజైన్లను మార్చింది. నానాటికి కరెన్సీ అవసరాలు పెరగడంతో 1975లో మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో రెండో నోట్ల ప్రింటింగ్ ప్రెస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

నోట్ల అవుట్ సోర్సింగ్

భారత కరెన్సీ అవసరాలు అందుకునేందుకు రెండు సెక్యూరిటీ ప్రెస్‌లు సరిపోలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వం 1997లో 360 కోట్ల నోట్ల ముద్రణకు ‘డీ లా రూ’ ప్రెస్ సహా యూరప్, అమెరికా, కెనడా దేశాల ప్రెస్‌లకు అవుట్ సోర్సింగ్ ఇచ్చింది. దానికి 647 కోట్ల రూపాయలను డాలర్ల రూపంలో చెల్లించాల్సి వచ్చింది. భారీ ఖర్చు రావడంతో అవుట్ సోర్సింగ్ బదులు పేపర్‌ను దిగుమతి చేసుకొని భారత్‌లోనే ముద్రించుకుంటే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీంతో 1999లో మైసూర్‌లో, 2000లో పశ్చిమ బెంగాల్‌లోని సల్బోనిలో మరో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు.

మళ్లీ పేపర్ దిగుమతి

ఆ తర్వాత కరెన్సీ అవసరాల కోసం ఏటా 22వేల మెట్రిక్ టన్నుల కాగితాన్ని దిగుమతి చేసుకుంటూ వచ్చారు. ఎక్కువగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రెస్ అయిన బ్రిటన్‌లోని డీ లా రూ ప్రెస్ నుంచే దిగుమతి చేసుకున్నారు. 200 ఏళ్ల చరిత్ర గల ఈ ప్రెస్ తొలినాళ్లలో కార్డులు, పోస్టల్ స్టాంపులు ముద్రించేది. మొత్తం భారత్ నోట్ల ముద్రణా ఖర్చులో 40 శాతం ఖర్చు పేపర్‌కే పోతోంది. 2016 జూన్ నాటికి ఆర్బీఐ ఏడాదిలో 212 కోట్ల నోట్లను ముద్రించింది. దీనికి 3,421 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని ఆర్బీఐ లెక్కలు తెలియజేస్తున్నాయి.  ప్రపంచంలో కరెన్సీని ఎక్కువగా ముద్రిస్తున్న దేశం చైనా తర్వాత భారతే.

మరిన్ని వార్తలు