బ్యాంకు ఖాతాలు తెరిపిస్తానంటూ మహిళలకు టోకరా

19 Aug, 2015 17:46 IST|Sakshi

పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఎస్‌బీఐ బ్యాంకు శాఖ వద్ద ఓ కేటుగాడు ఎనిమిది మంది మహిళలను బురిడీ కొట్టించాడు. బాధితుల కథనం మేరకు... వంటగ్యాస్ కనెక్షన్ కోసం ఖాతాలు తెరిచేందుకు కందరాడ గ్రామానికి చెందిన ఎమిమిది మంది మహిళలు బుధవారం బ్యాంకుకు వచ్చారు. ఏజెంట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే ఓ వ్యక్తి వారి దగ్గరకు వచ్చాడు.

వారు ఎందుకు వచ్చిందీ వివరాలు తెలుసుకుని... ఏజెంట్ వచ్చేందుకు సమయం పడుతుందని, తాను ఖాతాలు తెరిపిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.1,200 వసూలు చేశాడు. ఆ తర్వాత రెవెన్యూ స్టాంపులు తీసుకురావాలని చెప్పడంతో వారు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా అతడు పరారయ్యాడు. స్టాంపులతో బ్యాంకు శాఖకు తిరిగి వచ్చిన మహిళలు తాము మోసపోయామని తెలుసుకుని బ్యాంకు వారిని సంప్రదించారు. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

>
మరిన్ని వార్తలు