జీవాలకు నట్టల నివారణ మందులు తాగించాలి

10 Aug, 2014 23:56 IST|Sakshi
జీవాలకు నట్టల నివారణ మందులు తాగించాలి

- అడపాదడపా వర్షాల వల్ల రాత్రి వాతావరణం చల్లగా ఉంటున్నందున గొర్రెలు, మేకలను చలిగాలుల నుంచి కాపాడు కోవాలి. నేల రొచ్చు లేకుండా పరిశు భ్రంగా ఉంచుకోవాలి. నట్టల నివారణ మందులు తాగించాలి.
- జీవాలు ఎదకు వస్తున్నట్లయితే వాటిని జాగ్రత్తగా పోతుతో దాటించాలి. చూడితో ఉన్న జీవాల మేపు, ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ చూపాలి.
- అక్టోబర్/నవంబర్‌లో సైలేజి గడ్డిని తయారు చేయాలనుకునే రైతులు ఇప్పుడే ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న రకాలను విత్తుకోవాలి.  పప్పుజాతి, గడ్డిజాతి పశుగ్రాసాలను పెంచాలి. జీవాలను వర్షంలో తిప్పకుండా షెడ్డులోనో, ఇంటిపట్టునో ఉంచి పుష్టిగా మేపాలి.
- ఆచార్య టి. రఘునందన్ (9440477240),
అధిపతి, ఐఎల్‌ఎఫ్‌సీ, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్

రొయ్యల రైతు లాభదాయకత పెంచే బ్యాక్టీరియా!
- రొయ్యల పెంపకంలో నేల స్వభావంతోపాటు నీటి నాణ్యత కూడా రొయ్యల పెరుగుదలకు సహాయపడుతుంది. గుల్లకొట్టడం(మోల్టింగ్) ద్వారా రొయ్యలు వదిలిన గుల్లను కిటెనో లైటిక్ బ్యాక్టీరియా(చెద పురుగులు కాగితాన్ని ఏ విధంగా తినేస్తాయో అలా) జీర్ణం చేసుకుంటుంది. అందులోని ఖనిజ లవణాలన్నీటినీ చెరువులో మళ్లీ వినియోగంలోకి తెస్తుంది. రొయ్యల పెంపకం జరుగుతున్నన్ని రోజులూ ఈ రీసైక్లింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.
- నేల, నీరు ఈ బ్యాక్టీరియాకు ఎంత సహకరిస్తే అంతే నాణ్యతతో ఈ ఖనిజ లవణాల పునర్వినియోగ ప్రక్రియ జరుగుతుంది. తద్వారా రొయ్యల మోల్టింగ్ విధానం రైతుల లాభదాయకతకు తోడ్పడుతుంది.
- నీటి నాణ్యత(ముఖ్యంగా క్షారత్వం, గాఢత)లో తేడాలుంటే రొయ్యల మోల్టింగ్ ప్రక్రియ నిలిచిపోయి రొయ్యల పెరుగుదల ఆగిపోతుంది.
- ఆచార్య పి. హరిబాబు,
ప్రభుత్వ మత్స్యకళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా

పొదుగు వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలి
-    పాడి పశువుల్లో ప్రాణాంతకమైనది పొదుగువాపు వ్యాధి. 3 రకాల సూక్ష్మక్రిముల వల్ల పాల గ్రంధికి సోకుతుంది. పరిశుభ్రత పాటించడం ద్వారా రాకుండా జాగ్రత్తపడడం ఉత్తమం.
- ఈ వ్యాధి వల్ల పొదుగు ఎర్రబడి, వాచి పశువుకు జ్వరం వస్తుంది. చనిపోయే ప్రమాదమూ ఉంటుంది. పాల దిగుబడి తగ్గి, పాలలో కుదపలు కనపడతాయి. పాలు పలచబడి గోధుమ రంగుకు మారతాయి. కొన్నిసార్లు లక్షణాలు త్వరగా కనపడవు.
-    నివారణ మార్గాలు: పాలు తీసిన తర్వాత 4 చనులను పావిడిన్ లోషన్‌లో ముంచి తీయాలి. పశువులు వట్టిపోయే సమయంలో పొదుగులోకి ట్యూబు మందులు ఎక్కించాలి.
- డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506),
 అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, సాక్షి (సాగుబడి), సాక్షి టవర్‌‌స,6-3-249/1,
రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034
saagubadi@sakshi.com
 

మరిన్ని వార్తలు