పల్లెకు పోదాం... చలో చలో...

13 Jan, 2018 09:44 IST|Sakshi

సంక్రాంతి పండగకు తరలివస్తున్న జిల్లా వాసులు

ఏడాదంతా ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో వలస జీవనం

ఏడాదికోసారే కుటుంబ సభ్యులను కలిసేందుకు రాక

వస్తున్న ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైళ్లు, బస్సులు

ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న ఆయా శాఖలు

టిక్కెట్టు ధరల్లో మార్పులతో కొంత వరకూ భారం

ఉన్న ఊరికి... కన్నవారికి దూరమై... ఎక్కడెక్కడోబతుకు తెరువు సాగిస్తున్నవారికి సంక్రాంతి పండగఓ కలల వేడుక. దీనికోసం ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. పనులు చేసుకుని సంపాదించినదాంట్లో
కొంత తాముంచుకుని... మరికొంత కన్నవారికిపంపించి... ఇంకా మిగుల్చుకున్న దాంతో పండగల్లోజల్సా చేయడానికి చూస్తారు. కన్నవారికి బట్టలు కొనుగోలు చేసి తెస్తారు. ఇలా వస్తున్న వారితో  రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. పల్లెలు ఇప్పుడిప్పుడే కళకళలాడుతున్నాయి. పండగ శోభను సంతరించుకుంటున్నాయి.

సాక్షి ప్రతినిధి విజయనగరం: ఉన్న ఊళ్లో పనులు లేక.. చేసినా.. గిట్టుబాటు కాక... బతుకు తెరువు కోసం పరాయి ప్రాంతాలకు వలస వెళ్లక తప్పట్లేదు. అయినా సంక్రాంతి వచ్చిం దంటే సొంతూరుకు రావాల్సిందే. అయినవాళ్లతో సంబరాలు చేసుకోవాల్సిందే. ఇప్పటికే చెన్నై, హైదరాబాద్‌ నుంచి విజయనగరం వాసులు స్వస్థలాలకు కదిలొస్తున్నారు. వారి రాకతో రైళ్లన్నీ రద్దీగా మారాయి. రైల్వే, ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నా... ఇంకా వేలాడుతూ రావాల్సి వస్తోంది. చెన్నై నుంచి వచ్చే జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో నాలుగు పండుగ ప్రత్యేక రైళ్లు, నాలుగు రెగ్యులర్‌ రైళ్లు కిక్కిరిసిపోయాయి.  పండుగ రద్దీ దష్ట్యా ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. విజయవాడ, హైదరాబాద్‌లకు పది బస్సులు వే సింది. భాగ్యనగరం నుంచి కూడా జిల్లావాసులు పండుగకు వస్తుండటంతో అవి కూడా కిటకిటలాడుతున్నాయి.

వడ్డింపు భారమైనా...
విజయనగరం, పార్వతీపురం, సాలూరు డిపోల నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో ఎనిమిది సర్వీసులు నడుస్తుండగా ఇప్పుడు ఆ పన్నెండు నడుపుతున్నారు. హైదరాబాద్‌కు జిల్లా నుంచి ఒకే ఒక్క బస్సు విజయనగరం నుంచి వెళుతుండేది. ఇప్పుడు పది బస్సులు వేశారు. విజయవాడ, హైదరాబాద్‌ వెళ్లే బస్సులకు సాధారణ రోజుల్లో వరుసగా రూ.500లు, రూ.800లు వసూలు చేస్తుంటారు. పండగ కావడంతో విజయవాడ, హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికుల నుంచి వరుసగా రూ. 750లు రూ. 1200లు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేటు బస్సులు పండుగ సీజన్‌ను సొ మ్ము చేసుకుంటున్నాయి. సాధారణ టిక్కెట్లకు భారీ చా ర్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులపై భారం వేస్తున్నా యి. జిల్లా నుంచి 30 ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులు విజయవాడ, హైదరాబాద్‌ ప్రాంతాలకు నడుస్తుండగా విజయవాడకు రూ.700ల నుంచి రూ.850ల వరకూ, హైదరాబాద్‌కు రూ.1800ల నుంచి రూ.2వేల వరకూ ప్రయాణికుల నుంచి పిండుతున్నారు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కష్టనష్టాలకోర్చి సొంత ఊరికి వస్తున్నారు.

కుటుంబమంతా తరలివస్తాం: చెన్నయ్‌లో భవన నిర్మాణ పనుల్లో ఇద్దరం కలిసి పనిచేసుకుంటాం. ఎక్కువ కాలం అక్కడే పనుల్లో నిమగ్నమైపోతాం. పెద్ద పండగ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటాం. పండగకు ఇంటి దగ్గర ఆనందంగా గడపాల్సిందే.– శంకరరావు, శ్రీదేవి, కొత్తరేగ, రామభద్రపురం  మండలం

మరిన్ని వార్తలు