పులి హల్‌చల్‌

19 Nov, 2020 09:04 IST|Sakshi

వాహనదారులను వెంటాడిన వైనం 

చెట్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న యువకులు 

మరో గ్రామంలో ఆవుపై దాడి

బెజ్జూర్‌ (సిర్పూర్‌): కుమురం భీం జిల్లాలో పులుల సంచారం అధికమవుతోంది. బుధవారం ఓ పెద్దపులి హల్‌చల్‌ సృష్టించింది. ఒకే రోజు మూడు చోట్ల సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఇందులో బెజ్జూర్‌ మండలం ఏటిగూడ వద్ద రోడ్డుపై ఉన్న ప్రయాణికులను వెంటాడింది. బెజ్జూర్‌ మండలం నందిగామ్‌కు చెందిన కేశయ్య, బానయ్య బుధవారం మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఏటిగూడ పరిసర ప్రాంతం మాణికదేవర అటవీ ప్రాంతంలో వీరికి పెద్దపులి ఎదురుపడింది. దీంతో వారు వాహనాన్ని వదిలి పరుగులు తీశారు. కొద్ది దూరం వెంటాడటంతో తప్పించుకుని సమీపంలోని చెట్టు ఎక్కి ప్రాణాలతో బయటపడ్డారు.చదవండి:(పులి హల్‌చల్‌.. చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు)

ఈ విషయమై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో బెజ్జూర్‌ రేంజ్‌ అధికారి దయాకర్‌ సిబ్బందితో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పులి కదలికలను గుర్తించి అది వెళ్లిన మార్గాన్ని తెలుసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే కమ్మర్‌గాం నుంచి చింతలమానెపల్లి మండల కేంద్రానికి వెళ్తున్న ఇద్దరు యువకులకు పులి కనిపించింది. దీంతో పాటు బుధవారం సాయంత్రం బెజ్జూర్‌ మండలం గబ్బాయి గ్రామ సమీపంలో మేత మేస్తున్న ఆవుపై పులి దాడి చేసి చంపేసిందని బీట్‌ అధికారి అనిత తెలిపారు. వారం రోజుల క్రితం దహెగాం మండలం దిగిడలో ఓ యువకుడిపై పులి దాడి చేసి హతమార్చింది. ప్రస్తుతం ఇలా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పులిని బంధించేందుకు దిగిడ అడవుల్లో పది బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎనిమిది పులుల వరకూ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


చిరుత దాడి.. తప్పించుకున్న యువకుడు
ఇంద్రవెల్లి (ఖానాపూర్‌): ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం వాల్గొండ శివారులో చిరుతపులి దాడి నుంచి ఓ యువకుడు తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచి్చంది. గ్రామానికి చెందిన ఉయిక కుమార్‌ (25) మంగళవారం ఉదయం తన ఎడ్లను మేత కోసం పొలానికి తీసుకువెళ్లాడు. సాయంత్రం ఎడ్లను తీసుకుని ఇంటికి వస్తుండగా అటవీ ప్రాంతంలో చిరుత పులి ఒక్కసారిగా యువకుడిపై జంప్‌ చేసింది. కొంతలో గురి తప్పడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

మరిన్ని వార్తలు