ప్రజాహితం కావవి.. ప్రచారం కోసం వేసే వ్యాజ్యాలు

29 Sep, 2020 04:40 IST|Sakshi

‘గండికోట’ రిజర్వాయర్‌ నిర్వాసితుల పరిహారం వ్యాజ్యాలపై హైకోర్టు వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌లు) ప్రచార ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోతున్నాయని హైకోర్టు సోమవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. పత్రికల్లో వచ్చే కథనాల క్లిప్పింగులను జత చేసి, వాటి ఆధారంగా పిటిషన్‌లు వేస్తూ.. వాటినే పిల్‌లంటున్నారని తెలిపింది. ఇలా ఓ పిల్‌ దాఖలు చేసి, మరుసటి రోజు పత్రికల్లో పెద్దవిగా రాయించుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటిని తాము రోజూ చూస్తున్నామంది. హైకోర్టు ఉన్నది ఇలాంటి వ్యాజ్యాలను విచారించేందుకు కాదని తేల్చిచెప్పింది.
 
► గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన హైకోర్టు.. ఓసారి పరిహారం తీసుకున్నాక గ్రామాలను ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
► పరిహారం తీసుకుని కూడా గ్రామాలను ఖాళీ చేయబోమంటే దాని అర్థమేంటని ప్రశ్నించింది. 
► 2011లోనే నిర్వాసితులకు పరిహారం చెల్లించామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఆ వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
► తదుపరి విచారణను అక్టోబర్‌ 7కి వాయిదా వేసింది. 
► ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 
► గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ నేత బొల్లిశెట్టి సత్యనారాయణ, మరికొందరు పిల్‌లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 
► సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి, మరికొందరు ప్రభుత్వ న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ.. 90 శాతానికి పైగా పిల్‌లు కేవలం ప్రచార ప్రయోజన వ్యాజ్యాలేనని హైకోర్టు దృష్టికి తెచ్చారు. 
► 2011లోనే పరిహారం చెల్లించామని, దీన్ని తీసుకున్న వ్యక్తులు సైతం ఆ తర్వాత పునరావాస కేంద్రాల వద్ద సిమెంట్‌ రోడ్డు కోసం దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని జగన్‌మోహన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 
► పిటిషనర్‌ తరఫు న్యాయవాది చల్లా అజయ్‌కుమార్‌.. తాము పత్రికా కథనాల ఆధారంగా పిల్‌ వేయలేదన్నారు. 
► దీనికి న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ స్పందిస్తూ.. ‘ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లు పత్రికల్లో కథనం వచ్చింది. ఓ పత్రికలో స్వయంగా చదివాను’ అని స్పష్టం చేయడంతో అజయ్‌కుమార్‌ మౌనం వహించారు. 
► ఈ సమయంలో సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఈ పిల్‌ల్లో ‘ఇంటర్వీనర్స్‌’గా చేరాలని భావిస్తున్నామని తెలిపారు. 
► ఈ వ్యాజ్యాలను వ్యతిరేకిస్తూనా? సమర్థిస్తూనా? అని ధర్మాసనం ప్రశ్నించింది. 
► సమర్థిస్తున్నామని వీరారెడ్డి చెప్పగా.. అయితే ఇంటర్వీనర్‌గా చేరే బదులు వేరే పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చునని, సాధారణంగా ఇంటర్వీనర్స్‌గా చేరే వ్యక్తులు పిటిషన్లను వ్యతిరేకిస్తారని ధర్మాసనం తెలిపింది.  

మరిన్ని వార్తలు