14 నుంచి రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 15న అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా అది వాయుగుండంగా బలపడే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. మరోవైపు 14వ తేదీ నుంచి ఈశాన్య, తూర్పు గాలులు బలోపేతం కానున్నాయి.
వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంతలో 15న అల్పపీడనం ఏర్పడడం, ఈశాన్య, తూర్పు గాలులు తోడవడం వంటి కారణంతో వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే నెలకొంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది.