ప్రతీ ముస్లిం ప్రపంచంతో పోటీ పడాలి: సీఎం వైఎస్‌ జగన్‌

11 Nov, 2022 13:05 IST|Sakshi

సాక్షి, గుంటూరు: మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా గుంటూరులో​ జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘నేడు జాతీయ విద్యా దినోత్సవం, అలాగే మైనార్టీ సంక్షేమ దినోత్సం కూడా ఈరోజు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గారి 135వ జయంతి. ఆజాద్‌ గురించి తెలియని వ్యక్తి ఎవరూ ఉండరు. 

ఆజాద్‌ సేవలు మరువలేనివి. ముస్లింలో పేదలందరికీ తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సార్‌. మైనార్టీల సంక్షేమానికి దివంగత నేత ఒకడుగు ముందుకేస్తే.. ఆయన తనయుడిగా నేను రెండడుగులు ముందుకేస్తాను. మహానేత తనయుడిగా గర్వపడుతున్నాను. పదవుల నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని విధాలా మైనార్టీలకు న్యాయం చేస్తున్నాము. ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాము. నలుగురికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాము. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవిని మైనార్టీకి కేటాయించాము. 

మూడేళ్లలో మైనార్టీలకు డీబీటీ ద్వారా రూ.10,309 కోట్లు అందించాము. నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ. 10వేల కోట్లు అందించాము. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీలకు రూ.2,665 కోట్లు ఇస్తే.. మూడేళ్లలోనే మేము రూ.20 వేల కోట్లుకు పైగా ఇచ్చాము.  ప్రతీ ముస్లిం విద్యావంతుడు కావాలి. ప్రతీ ముస్లిం ప్రపంచంతో పోటీ పడాలి. విద్యావ్యవస్థలో మార్పులు చేస్తున్నాము. వక్ఫ్‌ ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే అన్యాక్రంతమైన 580 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాము. ఈ ప్రభుత్వం మీది అని మర్చిపోవద్దు’ అని స్పష్టం చేశారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు