అండగా నేనున్నా

9 Dec, 2023 04:13 IST|Sakshi

ఈ నష్టం, కష్టం చెప్పలేనంత బాధ కలిగిస్తోంది.. ఏ ఒక్కరినీ నష్టపోనివ్వం

తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించి పంట నష్టం పరిశీలన

దెబ్బతిన్న వరి పొలాలను చూసి చలించిపోయిన సీఎం.. 80 శాతం సబ్సిడీతో రైతన్నలకు విత్తనాల సరఫరా

కోతకు గురైన స్వర్ణముఖిపై రూ.30 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జికి ఆమోదం

నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా

రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణకు రూ.32 కోట్లతో ప్రతిపాదనలు  

సాక్షి తిరుపతి:  అధైర్యపడొద్దు.. అండగా నేనున్నానంటూ తుపాను బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు. మిచాంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించి బాధితులను స్వయంగా కలుసుకుని పరామర్శించారు.

పంట చేతికొచ్చే సమ­యంలో రైతన్నకు జరిగిన అపార నష్టాన్ని చూసి సీఎం జగన్ చలించిపోయారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని, పంట నష్టపోయిన రైతులకు 80% రాయితీతో శనగ విత్తనాలను సరఫరా చేస్తా­మన్నారు.  ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తీసుకొచ్చిన వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విపత్తు వేళ అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై బాధిత ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు చర్యలు తీసుకుందన్నారు.

గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరు­కున్న సీఎం జగన్‌ తొలుత తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిలాల్లోని తుపాన్‌ బాధిత ప్రాంతాలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. అనంత­రం కోట మండలం విద్యానగర్‌కు చేరుకున్నారు. అ­క్క­డి నుంచి రోడ్డు మార్గాన వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామానికి చేరుకుని కోతకు గురైన స్వర్ణముఖి నది, వరి పంటలను పరిశీలించారు. స్వర్ణముఖి కోతకు గురి కావటానికి కారణాలను ఆరా తీశారు. బాలిరెడ్డిపాళెంలో తుపాను బాధితులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

చెప్పలేనంత బాధగా ఉంది.. 
'ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు జిల్లా మొత్తం సగటుతో పోల్చుకుంటే అందులో సగం ఈ నాలుగైదు రోజుల్లోనే కురిసింది. దాదాపు 40 – 60 సెంటీమీటర్ల వర్షం కురిసిన పరిస్థితి. మనందరికీ జరిగిన ఈ నష్టం, కష్టం చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 92 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 8,364 మందిని తరలించాం. 25 కిలోల రేషన్‌ బియ్యం, కేజీ కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలు, లీటరు పామాయిల్‌ చొప్పున దాదాపు 60 వేల మందికి పైగా బాధితులకు అందచేశాం. ఏ రాష్ట్రంలోనూ లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది. అది.. వలంటీర్‌ వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ. అందువల్ల ఎవరికి ఎక్కడ ఏ నష్టం జరిగినా ఆందోళన చెందాల్సిన పనిలేదు.' అని సీఎం జగన్ తెలిపారు.

'ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చి చెబుతున్నా. నాకు నష్టం జరిగింది.. కానీ ఎదుటివాడికి మాత్రమే సాయం వచ్చింది.. నాకు రాలేదని అనుకోవాల్సిన పని లేదు. ఏ ఒక్కరినీ నష్ట పోనివ్వం. ప్రతి ఒక్కరికీ మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది. పంపిణీ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 62 వేల కుటుంబాలకు రేషన్‌ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.2,500 చొప్పున డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దానివల్ల ఇళ్లలోకి నీళ్లు వచి్చన వారికి, సామాన్లకు నష్టం జరిగిన వారికి, ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి కాస్తో కూస్తో ఉపశమనం కలుగుతుంది. ఇవాళ మొదలు పెడితే మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ప్రతి ఇంట్లోనూ రూ.2,500 చొప్పున డబ్బులిచ్చే కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళతారు. ఈ జిల్లాల్లో స్టాండింగ్‌ క్రాప్‌ లేదు కాబట్టి కాస్తో కూస్తో ఊరట. పంటలు వేసి నష్టపోయిన వారికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలను అందచేస్తాం. అన్నీ దగ్గరుండి కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. ఈ రోజు నుంచి వారంలోగా ప్రతి ఒక్కరికీ జరగాల్సిన మంచి జరుగుతుంది.' అని సీఎం జగన్ చెప్పారు. 

రెట్టించిన వేగంతో యంత్రాంగం
'తుపాన్‌ ప్రాంతాల్లో విద్యుత్తును చాలా వేగంగా పునరుద్ధరించారు. యంత్రాంగం అంతా ఇక్కడే నిమగ్నమై రెట్టించిన వేగంతో పని చేస్తున్నారు. ఇంకా కొన్ని కాలనీల్లో విద్యుత్తు లేని పరిస్థితి ఉంటే వలంటీర్ల ద్వారా వివరాలను సేకరించి కలెక్టర్లు సమస్యను పరిష్కరిస్తారు. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుందని మరోసారి చెబుతున్నా. ' అని అన్నారు.

పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు 
సీఎం పర్యటనలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, కాకాణి గోవర్థన్‌రెడ్డి, తానేటి వనిత, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యేలు వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, మేకపాటి విక్రమ్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, ఎమ్మెల్సీలు చంద్రశేఖరరెడ్డి, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, మేరిగ మురళీధర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, స్వచ్ఛాంధ్ర రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ దేవసేనమ్మ, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ ప్రభుత్వం మీదే..
'ఇక్కడికి రాకముందు స్వర్ణముఖి నదిలో కోత కారణంగా ఎలాంటి నష్టం జరిగిందో స్వయంగా చూశా. దానికి శాశ్వత పరిష్కారం వెతకాలని చెప్పా. హైలెవల్‌ బ్రిడ్జి కడితే బాగుంటుందని, అందుకోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని  చెప్పారు. ఈ సమస్యను తీరుస్తూ హైలెవల్‌ బ్రిడ్జిని శాంక్షన్‌ చేస్తున్నా. జిల్లాలో 110 చెరువులు ఉండగా కొన్ని చోట్ల కోతకు గురయ్యాయి. రోడ్లు మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుడతాం. రోడ్లు, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతుల కోసం రూ.32 కోట్ల ప్రతిపాదనలు అందాయి. యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేపట్టే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం మీది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ మంచే జరుగుతుంది. అంతేకానీ చెడు అనేది ఎప్పుడూ జరగదు. ఏ చిన్న సమస్యైనా, వాళ్లకు రా­వాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వెంటనే ‘జగనన్నకు చెబుదాం’ 1902 నంబర్‌కు ఫోన్‌ కొట్టండి. నా ఆఫీస్‌­కే ఫోన్‌ వస్తుంది. తుపాన్‌ బాధిత ప్రాంతా­ల్లో అందరికీ అన్నీ అందించే బాధ్యత­ను కలెక్టర్‌ తీసుకుంటారు. నాలుగైదు రోజు­ల్లో వారి దగ్గర నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటా.' అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఆ పత్రికలు చదవొద్దు.. అపోహలు నమ్మొద్దు: సీఎం జగన్‌

>
మరిన్ని వార్తలు