అంతిమ విజయం మంచినే వరిస్తుంది: సీఎం జగన్‌

24 Oct, 2020 10:22 IST|Sakshi

ప్రజలందరికీ‌ దసరా శుభాకాంక్షలు: సీఎం జగన్

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు  దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామని అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
(చదవండి: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం)

గవర్నర్ పండుగ‌ శుభాకాంక్షలు
విజయ దశమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి పండుగ ధర్మం ఆధిపత్యాన్ని సూచిస్తుందన్నారు. చెడుపై మంచి విజయం సాధిస్తుందన్న విషయాన్ని విజయదశమి స్పష్ట పరుస్తుందన్నారు. అమ్మలగన్న అమ్మ కనక దుర్గమ్మ దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాని ఓ ప్రకటనలో గవర్నర్‌ పేర్కొన్నారు. కరోనా నేపధ్యంలో చేతులు శుభ్రపరుచుకోవటం , మాస్క్ ధరించటం,  భౌతిక  దూరం పాటించడం ద్వారా పండుగను జరుపుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు