నెల్లూరులో జర్మన్‌ షెడ్స్‌తో అదనపు బెడ్లు

18 May, 2021 05:20 IST|Sakshi
జర్మన్‌ షెడ్స్‌ను ప్రారంభించిన మంత్రులు అనిల్‌కుమార్, గౌతమ్‌రెడ్డి. చిత్రంలో.. కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎమ్మెల్యే కోటంరెడ్డి తదితరులు

అత్యవసర ఆక్సిజన్‌ మొబైల్‌ బస్సులు ప్రారంభించిన మంత్రులు 

అనిల్‌కుమార్, మేకపాటి గౌతమ్‌రెడ్డి 

నెల్లూరు (అర్బన్‌): కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నెల్లూరులోని పెద్దాస్పత్రి (జీజీహెచ్‌)లో జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేశారు. ఇందులో అదనంగా 50 బెడ్లను రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రోగుల ఇబ్బందులు తొలగించేందుకు అదనపు బెడ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. పెద్దాస్పత్రిలో బెడ్స్‌ నిండిపోవడంతో బయట ఆవరణలో షెడ్లు వేసి అన్ని సౌకర్యాలతో ఆక్సిజన్‌ బెడ్స్‌ సిద్ధం చేశామని తెలిపారు.

అవసరాన్ని బట్టి బెడ్ల సంఖ్యను పెంచుతామన్నారు. కాగా, స్థానిక ఏసీ స్టేడియంలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో కృష్ణచైతన్య విద్యాసంస్థల సౌజన్యంతో ఏర్పాటు చేసిన రెండు మొబైల్‌ బస్సులను మంత్రులు ప్రారంభించారు. ఆస్పత్రిలో బెడ్‌ సకాలంలో అందక ఇబ్బంది పడుతున్న వారి కోసం తాత్కాలికంగా ఈ బస్సులను ప్రారంభించినట్టు తెలిపారు. బస్సులో ఆక్సిజన్‌ సౌకర్యంతో పాటు పడుకునేందుకు వీలుగా ఒక్కో బస్సుకు 9 సీట్లను సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు