పెట్టుబడుల ఆకర్షణకు జపాన్ డెస్క్

17 Dec, 2020 14:37 IST|Sakshi

విశాఖపట్నంలో 10 లక్షల చదరపు అడుగుల్లో 'జపనీస్‌ ఎన్‌క్లేవ్‌' 

జపాన్ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో జపాన్‌ ఇండ్రస్టియల్‌ టౌన్‌షిప్‌కు శ్రీకారం చుడుతున్నట్లు పరిశ్రమలు, ఐటి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. డీపీఐఐటీ, సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన జపాన్‌ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భాగస్వామ్య సదస్సులో కేంద్ర డీపీఐఐటీ శాఖ కార్యదర్శి గురు ప్రసాద్ మోహపాతర, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ రవీన్, ఈడీ ప్రతాప్ రెడ్డి, జపాన్‌కు చెందిన ఎకనమీ, ట్రేడ్, పరిశ్రమల శాఖ (ఎంఈటీఐ) వైస్ మంత్రి  సన్ షిగెహిరో టనక, జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్( జేఈటీఆర్‌వో  సీఐఐ వైస్ ఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్, జపాన్ భారత అంబాసిడర్ సంజయ్ కె వర్మ, సీఐఐ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. (చదవండి: విదేశాల్లోనూ యువతకు ఉపాధి కల్పన

ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ, ఎప్పటి నుంచో జపాన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. విశాఖలో 10 లక్షల చదరపు అడుగుల్లో జపనీస్‌ ఎన్‌క్లేవ్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. చైనా నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే జపాన్‌ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా 'జపాన్‌ డెస్క్‌ ఏర్పాటు' చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలో ఏటీసీ టైర్స్, యొకొహొమా గ్రూప్ వంటి ప్రఖ్యాత పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఒక్క వాహనాల టైర్ల తయారీలోనే రెండువేల మందికి ఉపాధి, యువతకు  శిక్షణ అందించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.(చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్‌)

శ్రీసిటీలో  జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్‌ భారీ స్థాయిలో ఏర్పాటయ్యిందన్నారు. వైజాగ్- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ) అభివృద్ధిలో భాగంగా మరో జపాన్ పారిశ్రామిక టౌన్ షిష్‌కు ప్రతిపాదించామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 25కిపైగా జపాన్‌ కంపెనీల పెట్టుబడులు పెట్టాయన్నారు. కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు వున్న 2,500 కి.మీ తూర్పు తీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఈస్ట్‌కోస్ట్‌ ఎకనామిక్‌ కారిడార్‌ను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని,అందులో భాగంగా తొలి దశలో విశాఖ చెన్నై కారిడార్‌ అభివృద్ధి జరగనుందని వెల్లడించారు.

జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజన్సీ నేతృత్వంలో  కృష్ణపట్నం కేంద్రంగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ , ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్(ఎన్‌ఐసీడీఐటీ) భాగస్వామ్యం ద్వారా చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్(సీబీఐసీ) అభివృద్ధికి 1300 కోట్ల నిధులు కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో పరిశ్రమలను ఆదుకోవడం కోసం కోవిడ్-19 సమయంలో ఆత్మనిర్భర్ సహా పలు కీలక సంస్కరణలు ప్రవేశపెట్టారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధిలో జపాన్ పాత్ర ఎంతో కీలకమని, రాష్ట్రంతో జపాన్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఏడాదిన్నర ప్రభుత్వంతో మరింత అనుబంధం ఏర్పడిందని  మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు