సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ

12 Aug, 2020 16:46 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సెప్టెంబర్‌ 20నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడలో పంచాయతిశాఖ మంత్రి కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగల భర్తీపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమవేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  మాట్లాడుతూ.. వచ్చే నెల 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమై వారం రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. సుమారు 10లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు.

తొలిరోజే సుమారు 4.5లక్షల మంది వరకు పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. దాదాపు 3నుంచి 5వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువగా ఖాళీలు ఉన్న పశుసంవర్థక అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షల నిర్వహణ ఉండాలని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఏపీపీఎస్సీ, పురపాలకశాఖ, వ్యవసాయ, పశుసంవర్థకశాఖ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు