అంటువ్యాధులు పరార్‌

25 Aug, 2020 02:54 IST|Sakshi

గ్రామాల్లో సగానికి తగ్గిన కేసులు

పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలే కారణం

సాక్షి, అమరావతి: గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలతో అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోల్చితే జూన్, జూలై, ఆగస్టులో మలేరియా కేసులు సగానికి పైగా తగ్గగా డెంగీ, డయేరియా 10–20 శాతానికే  పరిమితమైనట్లు పంచాయతీరాజ్‌ శాఖ పరిశీలనలో తేలింది.

13 వేల పంచాయతీల్లో పారిశుధ్య పనులు..
► ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనూ, అంతకు ముందు వేసవిలోనూ రాష్ట్రంలోని 13,322 గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీరాజ్‌ శాఖ సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టింది. ఓవర్‌ హెడ్‌ ట్యాంకు వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిత్యం క్లోరినేషన్, పూడికతీత, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం లాంటి చర్యలు పెద్ద ఎత్తున చేపట్టారు. 
► మండలానికి రెండు గ్రామాల చొప్పున 1,320 గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా మనం – మన పరిశుభ్రత పేరుతో చెత్త సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

నామమాత్రంగా డెంగీ కేసులు...
► గత ఏడాది జూన్, జూలై, ఆగస్టులో గ్రామీణ ప్రాంతాల్లో 1,163 మలేరియా కేసులు నమోదు కాగా ఈసారి ఇదే కాలంలో కేవలం 601 మాత్రమే నమోదైనట్లు పంచాయతీరాజ్‌ అధికారులు తెలిపారు. డెంగీ కేసులు గత ఏడాది మూడు నెలల్లో 944 కేసులు నమోదు కాగాఈసారి అదే వ్యవధిలో 24 మాత్రమే గుర్తించారు.
► గత ఏడాది 1,11,685 డయేరియా కేసులు మూడు నెలల్లో నమోదు కాగా, ఈ ఏడాది అదే వ్యవధిలో 20,355 మాత్రమే నమోదయ్యాయి. గతేడాది 9,528 టైఫాయిడ్‌ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 355 కేసులే నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు