Nara Lokesh: ఎమ్మెల్సీల ఆస్తుల్లో నారా లోకేశ్‌ టాప్‌.. ఏడీఆర్‌ రిపోర్టు వెల్లడి

14 Aug, 2022 04:49 IST|Sakshi

రూ.369 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు ఏడీఆర్‌ రిపోర్టు వెల్లడి

రూ.101 కోట్లతో రెండో స్థానంలో ఎమ్మెల్సీ వాకాటి 

ఏపీ ఎమ్మెల్సీల్లో 75% మంది కోటీశ్వరులు

సాక్షి, న్యూఢిల్లీ : శాసన మండలి సభ్యుల్లో 75 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), ఏపీ ఎలక్షన్‌ వాచ్‌ తాజా అధ్యయనం పేర్కొంది. ఎప్పటికప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు.. అభ్యర్థులు అందించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. మొత్తం 58 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్సీలలో 48 మంది వివరాలను(10 మంది అఫిడవిట్లు వారికి అందుబాటులో లేవు) విశ్లేషించారు. వీరిలో 75 శాతం మంది అంటే 36 మంది కోటీశ్వరులేనని స్పష్టమైంది.

ఇందులో అధికార వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు 22 మంది, ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు 11 మంది ఉన్నారు. కాగా, రూ.369 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ అత్యంత ధనవంతుడు అని ఏడీఆర్‌ రిపోర్టు పేర్కొంది. రెండో స్థానంలో రూ.101 కోట్లతో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఉండగా, మూడో స్థానంలో రూ.36 కోట్లతో  ఎమ్మెల్సీ టి.మాధవరావు ఉన్నారు.

ఇండిపెండెంట్‌ ఎమ్మెల్సీ పి.రఘువర్మ అత్యల్పంగా రూ.1,84,527 ఆస్తులు కలిగి ఉన్నారు. కాగా, 20 మంది ఎమ్మెల్సీలపై క్రిమినల్‌ కేసులున్నట్లు ఏడీఆర్‌ రిపోర్ట్‌ పేర్కొంది. ఎనిమిది మంది 5–12వ తరగతి మధ్య, 40 మంది గ్రాడ్యుయేట్‌ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారని తెలిపింది. 

మరిన్ని వార్తలు