యాత్రలో పాల్గొన్న వ్యక్తికి గుండెపోటు
వెంటనే సీపీఆర్ చేసి బతికించిన సీఐ త్రినాథ్
సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి యాత్రలో పాల్గొన్న ఓ వ్యక్తి ప్రాణాన్ని పోలీస్ అధికారి నిలబెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పాదయాత్ర కొనసాగుతుండగా.. ఓ వ్యక్తి గుండెపోటుకు గురై రోడ్డుపై పడిపోయాడు. దీంతో అక్కడున్నవారు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్ వారి వద్దకు రాలేని పరిస్థితి ఎదురైంది.
ఇంతలో అక్కడే విధి నిర్వహణలో ఉన్న సీఐ త్రినాథ్ వేగంగా స్పందించారు. సీపీఆర్ చేయడంతో అతని ప్రాణం లేచి వచ్చింది. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఆపద సమయంలో వేగంగా స్పందించి ప్రాణం నిలబెట్టిన సీఐ త్రినాథ్ను అక్కడున్నవారంతా ప్రశంసించారు.