మంత్రి గుమ్మనూరు జయరాం
సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశించారు. దీని కోసం అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని, ఈ స్పెషల్ డ్రైవ్ లో ఆయా పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
తాను కూడా కంపెనీల్లో తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఫ్యాక్టరీ, బాయిలర్ల శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు.