సీఎం జగన్‌ గుండె ధైర్యం ఎంతో గొప్పది

14 Nov, 2022 05:00 IST|Sakshi
ఆంధ్ర రెవెన్యూ ఉద్యోగులతో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు

రీ సర్వే చేయాలంటే ఎంతో దమ్ముండాలి 

తెలంగాణ రెవెన్యూ ఉద్యోగసంఘాల నేతల ప్రశంసలు

ఏఎన్‌యూ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుండె ధైర్యం ఎంతో గొప్పదని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగసంఘాల నాయకులు ప్రశంసించారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఎస్‌ఆర్‌ఏ) ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మూడు రోజులపాటు జరిగిన ఏపీ రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడలు, సాంస్కృతిక పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి ఏఎన్‌యూలో జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.రవీందర్‌రెడ్డి ప్రసంగిస్తూ భూములు రీ సర్వే చేయించాలంటే ఆ ముఖ్యమంత్రికి ఎంతో దమ్ముండాలని చెప్పారు. ఏపీలో భూముల రీ సర్వే ప్రారంభించిన సీఎం ఎంతో ధైర్యవంతుడన్నారు. రెవెన్యూకి సంబంధించిన సంస్కరణలు, సేవల్లో ఏపీ ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేస్తోందని, ఎన్నో అంశాలలో ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కె.గౌతంకుమార్‌ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూకి పూర్వవైభవం తెచ్చిన మహోన్నత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. అంతకుముందు కొన్ని ప్రభుత్వాలు, పాలకులు రెవెన్యూని నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టినా.. వైఎస్సార్‌ ముఖ్యమంత్రి కాగానే కొత్త ఉద్యోగాలు కల్పించడం, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం వంటి ప్రత్యేక చర్యలు చేపట్టి రెవెన్యూకి జీవం పోశారని చెప్పారు. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రెవెన్యూలో ఆదర్శవంతమైన సంస్కరణలు తెస్తున్నారని ప్రశంసించారు. 

మరిన్ని వార్తలు