గురుకుల విద్యార్థులకు వాట్సాప్‌ క్లాసులు 

17 Aug, 2020 05:01 IST|Sakshi

యూట్యూబ్‌ ద్వారా వీడియో పాఠాలు 

1.5 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగం 

సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తమ విద్యార్థులకు వాట్సాప్‌ క్లాసులు ప్రవేశపెట్టింది. గురుకుల కార్యదర్శి కల్నల్‌ వి.రాములు ఆదేశాల మేరకు ఈ విధానాన్ని గురుకులాల్లో టీచర్లు అమలు చేస్తున్నారు. కరోనా తీవ్రత కొనసాగుతున్న తరుణంలో సెలవుల అనంతరం కూడా విద్యార్థులను తిరిగి గురుకులాలకు పంపించేందుకు తల్లిదండ్రులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల దృష్టి చదువు నుంచి వేరే వ్యాపకాలవైపు మరలకుండా గురుకుల సంస్థ వాట్సాప్‌ క్లాసుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ విధానం ద్వారా గురుకుల స్కూళ్లలో చదువుతున్న 1.5 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. 

క్లాసులు ఇలా..  
► ఒక్కో తరగతికి ఒక్కో వాట్సాప్‌ గ్రూపు, గ్రూపులో 40 మంది విద్యార్థులు ఉండే విధంగా చర్యలు. 
► సబ్జెక్ట్‌లో నిపుణులు, వాక్చాతుర్యం ఉండే ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. వారు క్లాసు చెప్పేటప్పుడు వీడియో తీస్తారు. 
► ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి, వీడియో లింక్‌ను విద్యార్థుల స్మార్ట్‌ ఫోన్లకు పంపిస్తారు.  
► లింక్‌ ద్వారా యూట్యూబ్‌లో వీడియోను ఓపెన్‌ చేసి క్లాసును విద్యార్థులు పూర్తిగా వినవచ్చు. 
► విద్యార్థులు తమ అభిప్రాయాలు, సందేహాలను వాట్సాప్‌ గ్రూపులో టీచర్‌తో చర్చించవచ్చు.  

లాటరీ ద్వారా అడ్మిషన్‌లు 
ఈ సంవత్సరం గురుకుల స్కూళ్లలో కొత్తగా 5వ తరగతిలో చేరే విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు. ప్రతి సంవత్సరం పోటీ పరీక్ష పెట్టడం ద్వారా ఎంపిక జరిగేది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  

మరిన్ని వార్తలు