YSRCP Samajika Nyaya Bheri Bus Yatra: సామాజిక న్యాయం సీఎం జగన్‌ ఘనతే.. రాజమండ్రి బహిరంగ సభలో మంత్రులు

27 May, 2022 21:16 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టింది. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌లో నిర్వహించిన సామాజిక న్యాయభేరి భారీ బహిరంగ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ  మైనారిటీ మంత్రులు పాల్గొన్నారు.

వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం: పినిపే విశ్వరూప్‌
సభలో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాయన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విశ్వరూప్‌ అన్నారు.

మూడేళ్లలో చారిత్రాత్మక నిర్ణయాలు: తానేటి వనిత
మూడేళ్లలో సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని మంత్రి తానేటి వనిత అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు. బలహీన వర్గాలకు రాజకీయ సాధికారిత కల్పించారన్నారు. సమ సమాజ స్థాపనకు సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సామాజిక న్యాయం చేసింది సీఎం జగన్‌ మాత్రమేనని తానేటి వనిత అన్నారు.

పాలనలో బలహీనవర్గాలకు అవకాశం: ధర్మాన ప్రసాదరావు
బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పరిపాలనలో బలహీన వర్గాలకు అవకాశం కల్పించింది సీఎం జగన్‌ మాత్రమేనన్నారు. కేబినెట్‌లో 74 శాతం బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పించారన్నారు. ఎక్కడా అవినీతి లేకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ అవుతోందన్నారు. మూడేళ్లలో రూ.లక్ష 20 వేల కోట్లకు పైగా లబ్ధిదారులకు అందజేశాం. పాలనలో సీఎం జగన్‌ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని మంత్రి ధర్మాన దుయ్యబట్టారు.

>
మరిన్ని వార్తలు