TTD Budget 2023-24: వార్షిక బడ్జెట్ విడుదల చేసిన టీటీడీ.. ఎంతంటే?

22 Mar, 2023 13:16 IST|Sakshi

సాక్షి, తిరుమల: 2023-24 సంవత్సరానికి 4411 కోట్ల రూపాయలు అంచనాతో టీటీడీ పాలక మండలి బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 15వ తేదీన పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల కారణంగా పాలకమండలి నిర్ణయాలు బహిర్గతం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. 2023-24 సంవత్సరానికి రూ.4411 కోట్ల అంచనాతో బడ్జెట్‌కు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు.

ఏప్రిల్ చివరి కల్లా శ్రీనివాస సేతు ప్రారంభించి, భక్తులకు అందుబాటులో తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆన్ లైన్ సేవలను ఇకపై నిరంతరాయంగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. శ్రీవారి భక్తులు సౌకర్యార్థం రూ.5.25 కోట్ల వ్యయంతో అదనపు లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. తమిళనాడు రాష్ట్రం, ఉల్లందూర్ పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అదనంగా రూ.4 కోట్లు కేటాయింపు గానూ పాలక మండలి ఆమోదం తెలిపిందని, అంతే కాకుండా తిరుపతిలోని యస్.జీ.ఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనపు భవన నిర్మాణాలకు రూ.4.71 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.

ఇక ఒంటిమిట్టలో ఏప్రిల్ 5న శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నామని, కల్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో భక్తులు రద్దీ దృష్ట్యా వీఐపీ సిఫార్సు లేఖలు జారీ చేసే వారు నియంత్రణ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. విఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పు విధానాన్ని అలాగే కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు. డిసెంబర్ కల్లా చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రారంభిస్తాంమని, త్వరలోనే బాలాజి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీని సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభిస్తామని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి వెల్లడించారు.

చదవండి: తొమ్మిది మిషన్స్‌తో ఏపీ కొత్త పారిశ్రామిక పాలసీ.. వివరాలు ఇవిగో..

మరిన్ని వార్తలు