మేలో 5జీ స్పెక్ట్రమ్ వేలం షురూ..!

13 Feb, 2022 19:32 IST|Sakshi

దేశంలో 5జీ సేవలు ప్రారంభించేందుకు కీలక అడుగు పడుతున్నాయి. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) మార్చి నాటికి అమ్మకపు ప్రక్రియకు సంబంధించిన నియమ & నిబంధనలపై తన సిఫార్సులను సమర్పిస్తే ఈ ఏడాది మేలో 5జీ స్పెక్ట్రమ్ వేలం జరుగుతుందని టెలికాం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. "5జీ వేలానికి సంబంధించి తన సిఫార్సులను మార్చి నాటికి సమర్పించనున్నట్లు ట్రాయ్ తెలిపింది. ఆ తర్వాత మిగిలిన ప్రక్రియను పూర్తి చేయడానికి ఒక నెల రోజులు సమయం పడుతుంది" అని టెలికామ్ కార్యదర్శి కె. రాజరామన్ పీటీఐకి చెప్పారు. 

గతంలో స్పెక్ట్రమ్ వేలంపై ట్రాయ్ నుంచి సిఫార్సులు అందుకున్న తర్వాత వేలంలో బిడ్డింగ్ రౌండ్లను ప్రారంభించడానికి ప్రభుత్వం 60-120 రోజులు సమయం తీసుకునేది అని ఆయన అన్నారు. ఈసారి వేలం ప్రారంభించడానికి ట్రాయ్ నుంచి సిఫార్సులు వచ్చిన రోజు నుంచి డీఓటీకి రెండు నెలలు సమయం పడుతుందని రాజరామన్ తెలిపారు. డీఓటీ తెలిపిన వివరాల ప్రకారం.. స్పెక్ట్రమ్ ధర, దానిని కేటాయించే విధానం, స్పెక్ట్రం బ్లాక్ సైజు, చెల్లింపుల నిబంధనలు & షరతులు, ఇతరుల విషయాలపై ట్రాయ్ నుంచి డీఓటీ సిపార్సులను కోరుతుంది.

ఈ మేరకు ట్రాయ్ టెలికాం పరిశ్రమ, ఇతర వాటాదారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత డివోటికి సిఫార్సులను సమర్పిస్తుంది. ప్రస్తుత పద్ధతి ప్రకారం, ట్రాయ్ సిఫార్సులపై డీఓటీలోని డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్(గతంలో టెలికామ్ కమిషన్) నిర్ణయం తీసుకొని కేంద్ర మంత్రి వర్గ ఆమోదం కోసం పంపిస్తుంది. 5జీ వేలం నిర్వహణ భాద్యతలను డీఓటీ ఇప్పటికే ఎంఎస్‌టిసికి అప్పజెప్పినట్లు రాజరామన్ తెలిపారు. 

(చదవండి: మార్చిలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లపై సీబీటీ కీలక సమావేశం..!)

మరిన్ని వార్తలు