అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లాభం అప్‌

4 Aug, 2023 06:20 IST|Sakshi

క్యూ1లో రూ. 677 కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 44 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 677 కోట్లను తాకింది. వ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 469 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 41,066 కోట్ల నుంచి రూ. 25,810 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 40,434 కోట్ల నుంచి రూ. 24,731 కోట్లకు వెనకడుగు వేశాయి. ఈ కాలంలో అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ 2.13 కోట్లమంది ప్రయాణికులను హ్యాండిల్‌ చేసింది. 27 శాతం వృద్ధి ఇది. అదానీ న్యూ ఇండస్ట్రీ ఎకోసిస్టమ్‌ నుంచి మాడ్యూల్స్‌ విక్రయాలు 87 శాతం జంప్‌చేసి 614 మెగావాట్లకు చేరాయి.  

డేటా సెంటర్‌ పనులు..
విభిన్న బిజినెస్‌లు పటిష్ట వృద్ధిని సాధించడంతోపాటు కొత్త విభాగాలు సైతం పురోగతిలో ఉన్నట్లు అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ పేర్కొన్నారు. అదానీ కానెక్స్‌(చెన్నై డేటా సెంటర్‌ రెండో దశ) పనులు 74 శాతం పూర్తికాగా.. నోయిడా సెంటర్‌లో 51 శాతం, హైదరాబాద్‌లో 46 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. కచ్‌ కాపర్, నవీ ముంబై ఎయిర్‌పోర్ట్, 5 మెగావాట్ల ఆన్‌షోర్‌ విండ్‌ టర్బయిన్‌ సరి్టఫికేషన్‌ తదితర భారీస్థాయి ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా మౌలిక రంగంలో కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్స్, న్యూ ఇండస్ట్రీస్, డేటా సెంటర్, రోడ్స్‌ తదితర కొత్త బిజినెస్‌లను పటిష్టరీతిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు.    
 
ఫలితాల నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు బీఎస్‌ఈలో 2.4 శాతం ఎగసి రూ. 2,532 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు