బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.3,000 కోట్ల క్యూఐపీ

26 Aug, 2021 12:08 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకు ఆఫ్‌ ఇండియా రూ.3,000 కోట్ల నిధుల సమీకరణ కోసం క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ/సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ) ప్రారంభించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. వ్యాపార వృద్ధికి, నియంత్రణపరమైన కనీస అవసరాలను చేరుకునేందుకు నిధుల సమీకరణ చేపట్టనుంది.

క్యూఐపీ ఫ్లోర్‌ప్రైస్‌గా (షేరు ధర) రూ.66.19 నిర్ణయించింది. క్యూఐపీ కోసం ఈ నెల 10–23 మధ్య బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రోడ్‌షో కూడా నిర్వహించింది. యస్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ ట్రెజరీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్, ఎడెల్‌వీజ్, ఎస్‌బీఐ లైఫ్, మిరే, కోటక్‌ లైఫ్, ఫెడరల్‌ బ్యాంకు తదితర ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొన్నారు. ఫ్లోర్‌ ప్రైస్‌పై గరిష్టంగా 5 శాతం మించకుండా తగ్గింపును ఇచ్చే అవకాశం ఉందని బ్యాంకు తెలిపింది.

క్యూఐపీ కింద షేరు కేటాయింపు ధర (తుది)పై ఈ నెల 30న క్యాపిటల్‌ ఇష్యూ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. బ్యాంకులో ప్రమోటర్‌గా ఉన్న కేంద్ర సర్కారుకు ప్రస్తుతం 90 శాతానికిపైనే వాటా ఉంది. తాజా క్యూఐపీ అనంతరం ప్రభుత్వ వాటా చెప్పుకోతగ్గంత దిగిరానుంది. దీంతో కనీస ప్రజల వాటా విషయంలో నిబంధనలను పాటించేందుకు మార్గం సుగమం అవుతుంది. 
  


 

మరిన్ని వార్తలు