పుజారాకు టెక్నిక్‌తో పాటు మైండ్‌ పోయింది: వాన్‌

26 Aug, 2021 12:12 IST|Sakshi

లీడ్స్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా ఘోర వైఫల్యం కొనసాగుతూనే ఉంది. లీడ్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పుజారా తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు.  అండర్సన్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు మైకెల్‌ వాన్‌ పుజారాపై ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. '' పుజారా తన ఆటతీరును పూర్తిగా మరిచిపోయాడు. సముద్రంలో మునిగిన నావలా అన్న చందంగా పుజారా పరిస్థితి తయారైంది. అతనికి మైండ్‌ పోవడంతో పాటు తన మార్క్‌ టెక్నిక్‌ షాట్లను మరిచిపోయాడు. ఆటలో స్కోరు నమోదు చేయడం కంటే మ్యాచ్‌లో నిలవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆ ఒత్తిడిలో కూరుకుపోయి అతను తేలిగ్గా వికెట్‌ ఇచ్చేస్తున్నాడు.'' అంటూ కామెంట్స్‌ చేశాడు. 

2020 నుంచి చూసుకుంటే టెస్టుల్లో పుజారా సగటు 25కు తక్కువగా ఉండడం గమనార్హం. ఇక 11 ఇన్నింగ్స్‌ల నుంచి పుజారా అర్థసెంచరీ నమోదు చేయలేకపోయాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో పుజారా అర్థశతకం సాధించాడు. ఆ తర్వాత వరుసగా 15, 21, 7, 0, 17, 8,15,4,12 నాటౌట్‌, 9, 45 పరుగులు చేశాడు. ఇక అండర్సన్‌ టెస్టుల్లో పుజారాను ఔట్‌ చేయడం ఇది పదోసారి. అండర్సన్‌తో పాటు నాథన్‌ లియాన్‌(ఆస్ట్రేలియా) కూడా పుజారాను 10 సార్లు ఔట్‌ చేశాడు. పాట్‌ కమిన్స్‌ ఏడుసార్లు, జోష్‌ హాజిల్‌వుడ్‌ 6 సార్లు, ట్రెంట్‌ బౌల్ట్‌ 5 సార్లు, జాక్‌ లీచ్‌ 4 సార్లు, బెన్‌ స్టోక్స్‌ 4 సార్లు, స్టువర్ట్‌ బ్రాడ్‌ 4 సార్లు పుజారాను ఔట్‌ చేశారు.

ఇక మూడో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 40.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. రోహిత్‌ శర్మ (105 బంతుల్లో 19; 1 ఫోర్‌) టాప్‌ స్కోరర్‌ కాగా, అండర్సన్‌ (8–5–6– 3) నిప్పులు చెరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఓపెనర్లతోనే భారత ఇన్నింగ్స్‌ స్కోరును అధిగమించేసింది. ఆట నిలిచే సమయానికి 42 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. బర్న్స్‌ (52 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), హమీద్‌ (60 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 42 పరుగుల ఆధిక్యంలో ఉంది.

చదవండి: ENG Vs IND 3rd Test: తొలిరోజే టీమిండియా చెత్త రికార్డులు

మరిన్ని వార్తలు