హోంలోన్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌

21 Oct, 2020 15:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హోంలోన్‌ కస్టమర్లకు అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ భారీ ఊరట కల్పించింది. గృహరుణాలపై వడ్డీ రేట్లలో 25 బేసిస్‌ పాయింట్ల వరకూ రాయితీ కల్పించనున్నట్టు బుధవారం ప్రకటించింది. కస్టమర్ల సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా వారికి వడ్డీపై 25 బేసిస్‌ పాయింట్ల వరకూ రాయితీ ఇస్తామని వెల్లడించింది.

యోనో యాప్‌ ద్వారా రూ 75 లక్షలకు పైబడిన గృహ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. కాగా పండుగ ఆఫర్లలో భాగంగా రూ 30 లక్షల నుంచి రూ 2 కోట్ల లోపు గృహ రుణాలపై కస్టమర్ల క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా 20 బేసిస్‌ పాయింట్ల వరకూ వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్టు ఎస్‌బీఐ ఇప్పటికే ప్రకటించింది.

ఇదే రాయితీని ఎనిమిది మెట్రో నగరాల్లో రూ 3 కోట్ల లోపు గృహ రుణాలపై కూడా అందచేస్తామని బ్యాంకు తెలిపింది. యోనో యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అదనంగా 5 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రాయితీ ఉంటుందని ఎస్‌బీఐ పేర్కొంది. బ్యాంకు ప్రస్తుతం రూ 30 లక్షలలోపు విలువ కలిగిన గృహ రుణాలపై కనిష్టంగా 6.9 శాతం నుంచి వడ్డీ ఆఫర్‌ చేస్తుండగా రూ 30 లక్షలు పైబడిన గృహ రుణాలపై కనిష్ట వడ్డీ 7 శాతంగా నిర్ణయించింది. చదవండి : రుణానుబంధానికి మించి కార్పొరేట్‌తో సంబంధం!

మరిన్ని వార్తలు